Addam News
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 10:45 am Posted by : Addam News

కాలిఫోర్నియాలో 30 మంది భారతీయుల అరెస్టు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇమిగ్రేషన్ చెక్‌ పోస్టుల వద్ద బోర్డర్‌ పెట్రోల్‌ ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) పేర్కొంది. వారిలో 30 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది. వీరిలో కొందరు కమర్షియల్‌ ట్రక్‌ డ్రైవర్‌ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులు నడుపుతున్నట్లు, మరికొందరు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

అమెరికాలో ఇటీవల జరిగిన ట్రక్కు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్‌ (Donald Trump) సర్కారు విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వర్క్‌ వీసా (USA Visa)లు, కమర్షియల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీని ఇప్పటికే నిలిపివేసింది. ప్రస్తుతం వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు నిర్వహించిన ఆపరేషన్‌లో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీట్రక్కులు నడుపుతున్న 42 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 30 మంది భారత్‌కు చెందినవారు కాగా మిగిలినవారు చైనా, మెక్సికో, రష్యా, తుర్కియే మొదలైన దేశాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు.

 

అనంతరం కాలిఫోర్నియాలోని వాణిజ్య ట్రక్కింగ్ కంపెనీలను లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ఆపరేషన్ ‘హైవే సెంటినెల్‌’లో మరో ఏడుగురు అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 49కు చేరింది. వలస చట్టాల ఉల్లంఘనలను నివారించడం, దేశంలోని హైవేలను రక్షించడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png