Addam News
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 7:00 am Posted by : Addam News

ATMs: దేశంలో భారీగా తగ్గిన ఏటీఎంల సంఖ్య.. కారణం ఏంటంటే?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: దేశంలో డిజిటల్ విప్లవం, ముఖ్యంగా యూపీఐ (UPI) వినియోగం పెరగడంతో ఏటీఎంల (ATMs) అవసరం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన తాజా నివేదికలో వెల్లడించింది. జనం ఆన్‌లైన్ పేమెంట్లకు అలవాటు పడటంతో నిర్వహణ ఖర్చులు భరించలేక బ్యాంకులు ఏటీఎంలను మూసివేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 2,53,417గా ఉన్న ఏటీఎంల (ATMs) సంఖ్య, 2025 మార్చి నాటికి 2,51,057కు పడిపోయింది. ఇందులో ప్రైవేట్ రంగ బ్యాంకులు అత్యధికంగా తమ ఏటీఎంలను తగ్గించుకోగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా స్వల్పంగా కోత విధించాయి. ముఖ్యంగా బ్యాంక్ బ్రాంచుల వెలుపల ఉండే ‘ఆఫ్-సైట్’ ఏటీఎంలే ఎక్కువగా కనుమరుగవుతున్నాయి. అయితే, బ్యాంకేతర సంస్థలు నిర్వహించే ‘వైట్ లేబుల్ ఏటీఎంల’ (White Label ATMs) సంఖ్య మాత్రం స్వల్పంగా పెరగడం గమనార్హం.

మరోవైపు, ఏటీఎంలు (ATMs) తగ్గుతున్నప్పటికీ బ్యాంక్ బ్రాంచుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. 2025 నాటికి దేశంలో బ్యాంక్ శాఖల సంఖ్య 2.8 శాతం పెరిగి 1.64 లక్షలకు చేరింది. భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png