Addam News
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 7:43 am Posted by : Addam News

బంగ్లాదేశ్‌లో దారుణం..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితుల మధ్య మైనారిటీల భద్రతపై ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా రాజ్‌బరి జిల్లాలో అమృత్ మొండల్ (29) అలియాస్ సామ్రాట్ అనే హిందూ యువకుడిపై స్థానికులు మూకదాడి చేయగా, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రాజ్‌బరి జిల్లాలోని పంగ్షా సర్కిల్ లో బుధవారం రాత్రి గ్రామస్థులు దాడి చేయగా, గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అమృత్ మరణించాడు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం సామ్రాట్ తన అనుచరులతో కలిసి గ్రామంలోని షాహిదుల్ ఇస్లాం అనే వ్యక్తి ఇంటికి వెళ్లి డబ్బు డిమాండ్ చేశాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గ్రామస్థులు ఏకమై అతనిపై దాడికి దిగారు. పోలీసు రికార్డుల ప్రకారం.. అమృత్ మొండల్‌పై గతంలోనే క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇతనిపై ఒక హత్య కేసుతో పాటు మరో రెండు కేసులు నమోదై ఉన్నాయి. ‘సామ్రాట్ బహిన్’ పేరిట ఒక గ్యాంగ్‌ను నడుపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో పోలీసులు సామ్రాట్ అనుచరుడైన మొహమ్మద్ సెలిమ్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి ఒక పిస్టల్, షూటర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు

షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు పెరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల దీపూ చంద్ర దాస్‌పై జరిగిన దాడి మరువకముందే, మరో హిందూ యువకుడు మూకదాడికి బలికావడం మైనారిటీ వర్గాల్లో భయాందోళనలను పెంచుతోంది. అయితే, ఇది కేవలం మతపరమైన కోణమా లేక నేర చరిత్ర వల్ల జరిగిన దాడా అనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png