Addam News
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 4:19 am Posted by : Addam News

సకల కళల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా భూపతి వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక

సకల కళల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా భూపతి వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 11, ( అద్దం న్యూస్ ) :   సకల కళల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా భూపతి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగ‌ళ‌వారం నిర్వహించిన సమావేశంలో సకల కళల జేఏసీ రాష్ట్ర కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన కళాకారులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర చైర్మన్‌గా భూపతి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… తెలంగాణలోని వివిధ కళారూపాలు, జానపద కళలు, కళాకారుల సంక్షేమం, కళల పరిరక్షణ కోసం సకల కళల జేఏసీ నిరంతరం ఉద్యమిస్తుందని తెలిపారు. తెలంగాణలో జానపద కళల పరిరక్షణ, అభివృద్ధి కోసం తెలంగాణ జానపద అకాడమీని ఏర్పాటు చేయాలని, అలాగే తెలంగాణ జానపద యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సకల కళల జేఏసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలని, అర్హులైన కళాకారులకు వృద్ధాప్య పింఛన్లు అందించాలని, కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని, కనుమరుగవుతున్న జానపద కళారూపాలను పరిరక్షించి, భావితరాలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి అర్హులైన కళాకారులకు వృద్ధాప్య పింఛన్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు భూపతి వెంకటేశ్వర్లు తెలిపారు. జానపద కళల పరిరక్షణ, కళాకారుల హక్కులు, తెలంగాణ జానపద అకాడమీ, తెలంగాణ జానపద యూనివర్సిటీ ఏర్పాటు డిమాండ్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ బస్సు యాత్రలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల కళాకారులు, సాంస్కృతిక సంఘాలు, కళా వేదికలు, ప్రజా సంఘాలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. తెలంగాణ కళాకారుల గొంతుకగా సకల కళల జేఏసీ పనిచేస్తుందని, కళల పరిరక్షణతో పాటు కళాకారుల గౌరవం, గుర్తింపు, సంక్షేమం కోసం ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరంతరం పోరాటం కొనసాగిస్తామని భూపతి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన పలువురు కళాకారులు, సాంస్కృతిక ప్రతినిధులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

సకల కళల జేఏసీ రాష్ట్ర కమిటీ ఇదే :
  సకల కళల జేఏసీ రాష్ట్ర క‌మిటీ గౌర‌వాధ్య‌క్షులుగా రాజేష్, సాదు మహారాజు రఘోత్తమాచార్యులు, గౌరవ సలహాదారుగా కొమురయ్య, రాష్ట్ర చైర్మన్‌గా భూపతి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కన్వీనర్‌గా సుభాష్ చంద్రబోస్, కో–కన్వీనర్లుగా శ్రీనివాస్ ( మహబూబ్‌నగర్ ), మహమ్మద్ పాషా ( హన్మకొండ ), దేవేందర్ రావు ( భూపాలపల్లి ), కో–ఆర్డినేటర్లుగా నర్సయ్య ( పెద్దపల్లి ), సత్తయ్య ( వరంగల్ ), లచ్చన్న ( జగిత్యాల ),  ఎల్లన్న ( హైదరాబాద్ ), సోమయ్య ( సూర్యాపేట ),  నాగయ్య ( ఆసిఫాబాద్ ) తదితరులు ఎన్నిక‌య్యారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png