Addam News
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 8:26 am Posted by : Addam News

పీరియడ్స్‌ సమయంలో వ్యాయామం చేయొచ్చా?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: స్త్రీలు తమ పీరియడ్స్‌ సమయంలో వ్యాయామాలు చేయకూడదని కొందరు అభిప్రాయపడుతుంటారుగానీ… నిజానికి మహిళలు తమ రుతు సమయంలో ఎలాంటి సంకోచాలూ లేకుండా వ్యాయామాలు చేయవచ్చు. ఆ టైమ్‌లో చేయకూడదన్నది కేవలం అపోహ మాత్రమే. చాలామంది క్రీడాకారిణులు తమ రెగ్యులర్‌ ప్రాక్టీస్‌లో భాగంగా రుతుసమయంలోనూ వ్యాయామం చేస్తుంటారు. దాంతో ఎలాంటి నష్టమూ జరగదు. అయితే మహిళలు తమ రుతు సమయంలో ఒక విషయంలో కొంత అప్రమత్తతతో ఉండాలి.

అదేమిటంటే… రుతు సమయంలో వాళ్లు రక్తం కోల్పోతూ ఉండటం వల్ల వాళ్ల దేహంలో ఐరన్‌ మోతాదులు తగ్గే అవకాశం ఉన్నందున.. ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండటం చాలా మేలు చేస్తుంది. ఐరన్‌ మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలు… మాంసాహారాల్లో వేటవూంసం, చికెన్, చేపలు, లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు (పాలకూర వంటివి), ఎండుఖర్జూరం, గసగసాలు, చిక్కీ వంటి పదార్థాల్లో ఐరన్‌ మోతాదులు ఎక్కువ.

ఇవి కేవలం పీరియడ్స్‌ సమయంలోనే కాకుండా మామూలు టైమ్‌లోనూ తీసుకుంటుంటే వారిలో ఐరన్‌ ఎప్పటికప్పుడు భర్తీ అవుతుంది. దూరంగా ఉండాల్సిన పదార్థాలివే… రుతు సవుయంలో వారు నువ్వులు, ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే దేహం కాస్తంత మందకొడిగా మారడంతో వ్యాయామాలు చురుగ్గా చేయలేకపోవచ్చు. కేవలం రుతు సమయంలోనే కాకుండా మిగతా టైమ్‌లో కూడా వీటితో చురుకుదనం తగ్గవచ్చు. కాబట్టి చురుగ్గా ఉండాలంటే.. మహిళలు తమ ఆహారంలో ఉప్పు, కొవ్వులు తగ్గించాలి. రుతు సవుయంలో సాధారణ రోజుల కంటే నీళ్లు, పండ్లరసాల వంటి ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం మేలు చేస్తుంది. అంతేకాదు… వేళకు పడుకుని, కంటినిండా నిద్రపోవడం వల్ల పూర్తి ఆరోగ్యమూ బాగుంటుంది. వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) మెరుగుపడుతుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png