Addam News
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 5:25 am Posted by : Addam News

ఘనంగా జన సమితి ఆవిర్భావ వేడుకలు

 

హైదరాబాద్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ :    తెలంగాణ జన సమితి ఏడవ ఆవిర్భావ వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. అడిక్‌మెట్‌ డివిజన్ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కాకునూరి సుధాకర్ ఆధ్వర్యంలో రాంనగర్ గుండు వద్ద ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలలో తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుత విజయాలను సాధించిందని, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడానికి అహర్నిశలు కృషి చేసిందని అన్నారు. నిరుద్యోగ సమస్యపై, రైతాంగ సమస్యపై, ఆర్టీసీ సమస్యలపై, ఆదివాసీల సమస్యలపై పోరాడుతూనే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం శ్రమించిందని అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలను చైతన్యం చేసిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉద్యమ ఆకాంక్షల సాధనకు కృషి చేస్తుందని నర్సయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ జన సమితి కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ యాదవ్, బీసీ జన సమితి అధ్యక్షుడు ఎస్.జస్వంత్ కుమార్, జన సమితి నగర ఉపాధ్యక్షుడు పునిరెడ్డి జయపాల్ రెడ్డి, నాయకులు ప్రేమ్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png