ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
– మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని
మోదీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత ముఖ్యమని చెప్పారు. గురువారం నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2 విస్తరణతో పాటు పలు ప్రతిపాదనలను అందించారు. మెట్రో ఫేజ్–2లో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు రూ.38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు పనులకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఉత్తర భాగంలో భూసేకరణ ఖర్చులో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని గుర్తుచేస్తూ, ఎన్హెచ్ఏఐకి రూ.626 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఉత్తర భాగానికి సంబంధించి 90 శాతానికి పైగా భూసేకరణ అవార్డు పూర్తయిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నిర్మాణం కూడా తెలంగాణ రాష్ట్రానికి అంతే కీలకమని ముఖ్యమంత్రి వివరించారు. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ కారిడార్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ చుట్టూ రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ మ్యాపులు, హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్లను ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖకు అందించామని, ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ – అమరావతి – బందర్ పోర్ట్ ఎక్స్ప్రెస్వేకు కేంద్రం అనుమతి ఇవ్వాలిని, హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టును కలిపే 12 లేన్ల ఎక్స్ప్రెస్వే తెలంగాణకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందన్నారు.
120 మీటర్ల రైట్ ఆఫ్ వే తో ప్రతిపాదించిన ఈ హైవే ద్వారా సముద్ర తీరం లేని తెలంగాణకు పోర్ట్ కనెక్టివిటీ లభిస్తుంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ఎగుమతులకు ఇది కీలక మార్గంగా నిలుస్తుందని ప్రధాన మంత్రికి వివరించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించాలన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. వరంగల్ విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ఇప్పటికే పూర్తిచేసి ఎయిర్ పోర్ట్ అథారిటీకి అప్పగించామని, వరంగల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారు. ఐఐఎంకు అవసరమయ్యే 200 ఎకరాల స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, టీఐఎఫ్ఆర్ వంటి ప్రముఖ జాతీయ విద్యా సంస్థలున్నాయి. ఐఐఎం ఏర్పాటు చేస్తే నూతన విద్యావిధానం-2020 ఆశించిన లక్ష్యం కూడా నెరవేరుతుందని ప్రధానమంత్రికి వివరించారు.![]()
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png