Addam News
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 11:16 am Posted by : Addam News

పాక్‌ చేతిలో ఓటమి.. బీసీసీఐ సీరియస్‌

పాక్‌ చేతిలో ఓటమి.. బీసీసీఐ సీరియస్‌

 

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అండర్‌-19 ఆసియా కప్‌లో ఆయుష్‌ మాత్రే నేతృత్వంలోని భారత జట్టు వరుసగా అన్ని మ్యాచ్‌లు గెలిచి కీలకమైన టైటిల్ పోరులో తడబడింది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ 191 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల అండర్-19 జట్టు ప్రదర్శనపై సోమవారం ఆన్‌లైన్‌లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్ సమావేశంలో బోర్డు సభ్యులు చర్చించారు. టీమ్ పెర్ఫామెన్స్‌పై సమీక్ష అవసరమని నిర్ణయించారు.

తుది పోరులో పాకిస్థాన్ 50 ఓవర్లలో 347/8 పరుగుల భారీ స్కోరు చేస్తే.. భారత్ 156 పరుగులకే ఎందుకు పరిమితమైంది అనే దానిపై టీమ్‌మేనేజ్‌మెంట్‌ నుంచి వివరణ కోరే అవకాశముంది. ప్రధాన కోచ్ హృషికేశ్‌ కనిత్కర్, కెప్టెన్ ఆయుష్‌ మాత్రేలతో కూడా బోర్డు సభ్యులు చర్చించనున్నారు. ఫైనల్‌లో ఓటమిని బీసీసీఐ (BCCI) సీరియస్‌గా తీసుకోవడానికి ఓ కారణం ఉంది. జనవరిలో అండర్-19 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు జట్టులోని లోపాలను సరిదిద్ది, ప్రపంచ కప్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని బీసీసీఐ యోచిస్తోంది.

భారత ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీకి ఫిర్యాదు

పాక్‌తో జరిగిన ఫైనల్‌లో భారత ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్‌ మాత్రే హద్దుమీరి ప్రవర్తించారు. పాకిస్థాన్ పేసర్ అలీ రజా వీరిని ఔట్ చేశాడు. ఔటైన తర్వాత వైభవ్, ఆయుష్‌.. పాక్ బౌలర్‌ను దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీనిపై ఆయుష్‌ మాత్రే, ప్రధాన కోచ్ హృషికేశ్‌ కనిత్కర్ నుంచి బీసీసీఐ వివరణ కోరే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు.. ఫైనల్‌లో పాక్‌ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని పీసీబీ చీఫ్‌ మోసిన్ నఖ్వీ తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png