Addam News
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 4:07 am Posted by : Addam News

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

తార్నాక, సెప్టెంబ‌ర్ 11, ( అద్దం న్యూస్ ) :   వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ… వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాలని సూచించారు.

మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. భక్తి, సంప్రదాయాలతో పాటు పర్యావరణ పరిరక్షణను కూడా ప్రజలు తమ బాధ్యతగా భావించాలని కోరారు. మోతె శోభన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించారు. పర్యావరణహితంగా వినాయక చవితిని జరుపుకోవాలని నిర్వాహకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png