Addam News
Newspaper Banner
Date of Publish : 14 June 2025, 3:13 am Posted by : Addam News

వ‌ర్షాలు, విద్యుత్ అంత‌రాయంతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మ‌వుతుంటే ప‌ట్టించుకోరా ! – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ :   నగరంలో భారీవర్షాల వల్ల రోడ్లు, చెట్లు కూలి, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం కలిగి జనజీవనం అస్తవ్యస్తమ‌వుతుంటే ప్ర‌భుత్వం కానీ, జిహెచ్ఎంసి అధికారులు ప‌ట్టించుకోరా అని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… వర్షాకాలం ప్రారంభంలోనే ఈ వర్షాల వల్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న 3 నెల‌ల వర్షాకాలం నుంచి ప్రజలను రక్షించేది ఎవరనేది ప్రశ్నార్థకం అని అన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన జిహెచ్ఎంసి కేవలం ప్రేక్షకుల లాగా కళ్లప్పగించి చూస్తోందని విమ‌ర్శించారు. నగరానికి ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ నగరాన్ని ఏనాడు పట్టించుకకోలేదన్నారు. ఎమర్జెన్సీ స్క్వాడ్ ఎక్కడుంది ? మున్సిపల్ కార్పొరేషన్, ప్రజల ప్రాణాలను పట్టించుకోకపోవడం విచారకరమని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న ఒకటే… లేకున్నా ఒకటే.. అని అన్నారు. చినుకు పడితే చీకటిమయమై చిత్రమవుతుందని, నగరంలో ప్రజల జీవితం. వర్షాకాలం రాకముందే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో జిహెచ్ఎంసి ఏం చేస్తుందో అని అర్థం కావడం లేదని అన్నారు. చినుకు పడితే సంద్రాన్ని తలపిస్తున్న నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారి భయానక పరిస్థితులు తలెత్తుతాయన్నారు. గత ప్రభుత్వం కెసిఆర్ నగరాన్ని డల్లాస్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా, మరో న్యూయార్క్ చేస్తా ఇని మాయ మాటలు చెప్పి 10 సంవ‌త్స‌ర కాలం కాలయాపన చేశారని విమ‌ర్శించారు. ఇప్పుడు మళ్లీ ఈ ముఖ్యమంత్రి కొత్తగా మరో మహా నగరంగా మహేశ్వరం అనడం కాక ఉన్న నగరాన్ని సరిగ్గా మలుచుకోవాల‌ని సాయిబాబా అన్నారు. చినుకు పడితే నగరం నరకానికి నకలుగా మారిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సర 6 నెలలు గడుస్తున్నా పాలనపై ఈ ప్ర‌భుత్వం పట్టు సాధించలేక‌పోతుంద‌న్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు విపత్తు సమయాల్లో ప్రజలకు అండగా ఉంటారని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఉండి, కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మమేకమై ఎల్లప్పుడు వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. కాబట్టి మెంటనే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాయ‌కులు ఎస్.ప్రకాష్, కిరణ్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png