Addam News
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 7:50 am Posted by : Addam News

సైబర్‌ వలలో మాజీ ఐపీఎస్‌..

సైబర్‌ వలలో మాజీ ఐపీఎస్‌..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  పంజాబ్‌లో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన సమాజంలో పెరిగిపోతున్న సైబర్‌ నేరాల తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం సామాన్యులే కాదు, శాంతిభద్రతలపై పట్టున్న ఒక మాజీ ఉన్నతాధికారి కూడా ఈ ఉచ్చులో పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో అమాయకత్వాన్నే కాదు, నమ్మకాన్ని కూడా సైబర్ నేరగాళ్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. పంజాబ్‌లో మాజీ ఐజీపి హోదాలో పనిచేసిన అమర్‌సింగ్‌ చాహల్‌ సుమారు రూ. 8.10 కోట్ల మేర సైబర్‌ మోసానికి గురై, ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.

డిజిటల్ ట్రాప్..

ఈ తరహా మోసాల్లో నేరగాళ్లు ప్రధానంగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలను వాడుకుంటారు. అమర్‌సింగ్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ప్రముఖ బ్యాంకు అధికారులుగా, వెల్త్ మేనేజ్‌మెంట్ సలహాదారులుగా ముసుగు వేసుకుని పరిచయం చేసుకున్నారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఐపీవో కేటాయింపులు అంటూ తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. పెట్టుబడి పెట్టిన తర్వాత, అది లాభాల్లో ఉన్నట్లు చూపించే ఫేక్ యాప్స్ లేదా వెబ్‌సైట్లను సృష్టించి బాధితుడిని మరింత నమ్మించారు. లాభాలను విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్సులు, సర్వీస్ ఫీజులంటూ మరిన్ని కోట్లు వసూలు చేశారు.

మాజీ పోలీసు అధికారినయ్యుండి తానే సైబర్‌ వలలో చిక్కుకోవడాన్ని అవమానంగా అమర్‌సింగ్‌ భావించారు. తాను మోసపోయిన విధానాన్ని వివరిస్తూ, సైబర్‌ నేరగాళ్లపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేయాలని పంజాబ్‌ డీజీపీని కోరుతూ ఆయన 12 పేజీల నోట్‌ రాశారు. అనంతరం సెక్యూరిటీ గార్డుకు చెందిన రైఫిల్‌తో తనను తాను కాల్చుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png