Addam News
Newspaper Banner
Date of Publish : 30 July 2025, 9:38 pm Posted by : Addam News

జీహెచ్ఎంసీ పర్మినెంట్ ఉద్యోగులకు ఒక్కోక్కరికి 150 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలి – జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ ఆర్‌వి.క‌ర్ణ‌న్‌ను కోరిన ఐఎన్‌టియుసి అధ్య‌క్షుడు డాక్ట‌ర్‌.జి.సంజీవ‌రెడ్డి

జీహెచ్ఎంసీ పర్మినెంట్ ఉద్యోగులకు ఒక్కోక్కరికి 150 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలి

– జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ ఆర్‌వి.క‌ర్ణ‌న్‌ను కోరిన ఐఎన్‌టియుసి అధ్య‌క్షుడు డాక్ట‌ర్‌.జి.సంజీవ‌రెడ్డి

హైదరాబాద్ బ్యూరో, జులై 30, అద్దం న్యూస్ :  జీహెచ్ఎంసీ పర్మినెంట్ ఉద్యోగులకు ఒక్కోక్కరికి 150 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలని ఐఎన్‌టియుసి అధ్య‌క్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ జి.సంజీవరెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ ను కోరారు. ఈ మేరకు సంజీవరెడ్డి ఐఎన్‌టియుసి నేతలతో కలిసి బుధవారం కమిషనర్‌ను ప్రధాన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ… జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో చాలా మందికి సొంత ఇళ్లు లేవ‌ని, ఏళ్లుగా జీహెచ్ఎంసీనే నమ్ముకుని పని చేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులందరికీ ఇండ్ల స్థలాలను కేటాయించాలని కోరారు. దీంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జీహెచ్ఎంసీ యూనియన్ గుర్తింపు ఎన్నికలను కూడా నిర్వహించి, కార్మికులు, ఉద్యోగుల తరపున గళం విన్పించే అవకాశం కల్పించాలని కోరారు. ఉద్యోగుల పలు రకాల అనారోగ్య సమస్యలతో తరుచూ బాధపడుతున్నారని, వారు హాస్పిటల్స్‌లో వైద్యం పొందేందుకు వీలుగా రాష్ట్రంలోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగుల మాదిరిగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్యాకేజీని రూ.15 లక్షల వరకు పెంచాలని కోరారు. చాలా కాలంగా ఎంతో మంది నాలుగో తరగతి ఉద్యోగులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారని, వీరిలో చాలా మంది ఎదురుచూసి పదవీ విరమణలు కూడా పొందుతున్నారని, తద్వారా ఉద్యోగులు పదోన్నతులు పొందే హక్కును కొల్పోతున్నారని వివరిస్తూ, వెంటనే పదోన్నతులను కల్పించాలన్నారు.                                                                                              ప్రస్తుతం ఆయా సర్కిళ్లలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఆఫీసర్లకు వెంటనే డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించాలని, ఇటీవలే ఎలాంటి కారణాల్లేకుండా బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని, వెంటనే నోటీసులను వెనక్కి తీసుకుని వేధింపులను ఆపివేయాలని సంజీవరెడ్డి కమిషనర్ కర్ణన్ ను కోరారు. వినతి పత్రం సమర్పించిన సంజీవరెడ్డితో పాటు ఐఎన్‌టియుసి గుర్తింపు పొందిన మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్, ఐఎన్‌టియుసి జనరల్ సెక్రటరీ ఆర్‌డి.చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీ ఏవీఎస్ గాంధీ, ఉమెన్ కమిటీ చైర్ పర్సన్ ఎల్.మెర్సీ, యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎం. మోజెస్, అడిషనల్ జనరల్ సెక్రటరీ కె.శివకుమార్ తదితరులున్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png