ఎలాంటి తారతమ్యం లేకుండా హనుమాన్ శోభాయాత్రను జరుపుకోవాలి
– సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి
హైదరాబాద్, అద్దం న్యూస్ : హిందు, ముస్లిం అనే తారతమ్యం లేకుండా హనుమాన్ శోభాయాత్రను జరుపుకోవాలని సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి సూచించారు. శనివారం ( నేడు ) హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీరహనుమాన్ విజయ యాత్రలను నిర్వహిస్తున్న నేపధ్యంలో ముషీరాబాద్లోని ఓ ఫంక్షన్హాల్లో హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని చిక్కడపల్లి డివిజన్ పీస్ కమిటీ సభ్యులు, హనుమాన్ శోభాయాత్ర నిర్వాహకులతో సమన్వయ సమావేశం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి హాజరై మాట్లాడుతూ… వీర హనుమాన్ విజయ శోభాయాత్రలో ఎలాంటి డిజె సౌండ్ సిస్టంలకు అనుమతిలేదని స్పష్టం చేశారు. ముషీరాబాద్లో హిందు, ముస్లిం అనే తారతమ్యం లేకుండా శాంతియుతంగా హనుమాన్ శోభాయాత్రే కాదు ప్రతి పండుగను నిర్వహించుకుంటామని నిర్వాహకులు తెలియచేశారన్నారు. గతంలో ముషీరాబాద్లో గొడవ జరిగిందని, దాని నేపధ్యంలో ప్రతి పోలీసు బందోబస్తు సమయంలో ఆ గొడవ ప్రస్తావన వస్తూ ఉంటుందన్నారు. కానీ ఇక్కడి పీస్ కమిటీ సభ్యులు, హనుమాన్ శోభాయాత్రల నిర్వాహకుల మాటలు విన్నాక యాత్ర శాంతియుతంగా కొనసాగుతుందనే నమ్మకం వచ్చిందన్నారు. హనుమాన్ శోభాయాత్రతో పాటు ప్రతి పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి ఏసిపి రమేష్, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ రాంబాబు, డిఐ నదీమ్హుస్సేన్, గాంధీనగర్, చిక్కడపల్లి, దోమలగూడ, ముషీరాబాద్ పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో పాటు పీస్ కమిటీ, హనుమాన్ శోభాయత్ర నిర్వాహకులు ఎజాజ్ హుస్సేన్, మహ్మద్ జహంగీర్, మహ్మద్ ఖదీర్, అతర్ భాయ్, గడ్డం నవీన్, కంచి ముదిరాజ్, దీక్షిత్రెడ్డి, నల్లవెల్లి అంజిరెడ్డి, మహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png