హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : యాజమాన్య నిర్లక్ష్యం తోనే పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి 36 మంది కార్మికులు మరణించారని ఆమ్ ఆద్మి పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడం బాధాకరం అని అని అన్నారు. శ్రమజీవులు పిట్టల్లా రాలి పోయిన ఘటనే అందుకు నిదర్శనం అని, మృతుల కుటుంబాలకు ఆప్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వడం తోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని అయన డిమాండ్ చేసారు. పాశమైలారం, సిగాచీ కెమికల్స్ పరిశ్రమ ప్రమాదంలో గాయపడ్డ వారిని హైదరాబాద్ చందా నగర్ లోని మంగళవారం ప్రణామ్ ఆసుపత్రిలో డాక్టర్ దిడ్డి సుధాకర్ తోపాటు ఆప్ రాష్ట్ర నాయకులూ డాక్టర్.సోలొమన్ రాజ్, డాక్టర్.లక్ష్య నాయుడు, సుధారాణి, జావీద్ షరీఫ్, లియాఖత్ ఖాన్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ… పరిశ్రమల్లో భద్రతా నియమాలను పాటిస్తున్నారా లేదా అని చూడడంలో పరిశ్రమల, కార్మిక శాఖలు నిరంతర తనిఖీలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైయ్యాయని ఆయన ఆరోపించారు. పరిశ్రమలలో భారీ పేలుళ్ల ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. డాక్టర్.సోలొమన్ రాజ్ మాట్లాడుతూ… ఈ ప్రమాదంలో ప్రభావిత కుటుంబాలకు కేవలం ఆర్థిక పరిహారం మాత్రమే కాకుండా, తమ జీవనోపాధిని పునర్నిర్మించేందుకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులను రక్షించేందుకు కఠినమైన భద్రతా విధానాలను అమలు చేయాలని, ఇలాంటి దుర్ఘటనలను నివారించేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png