Addam News
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 12:17 am Posted by : Addam News

అక్రమంగా అరెస్టు చేసిన డివైఎఫ్ఐ నాయకులను విడుదల చేయాలి

 

హైదరాబాద్, ఏప్రిల్ 01, అద్దం న్యూస్ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీకి చెందిన 400 ఎకరాల భూములని కార్పొరేట్‌ సంస్థలకు వేలం వేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెన‌క్కు తీసుకోవాల‌ని డివైఎఫ్ఐ రాష్ట్ర క‌మిటీ డిమాండ్ చేసింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్యతిరేకిస్తూ గత పది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. అదే విధంగా మంగ‌ళ‌వారం హెచ్‌సియు వద్ద ధ‌ర్నా నిర్వ‌హించిన‌ డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు హష్మీ బాబును పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ పై పిడిగుద్దులు గుద్ది గాయాల పాలు చేయ‌డాన్ని డివైఎఫ్ఐ ఖండించింది. ఈ సంద‌ర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు మాట్లాడుతూ… హెచ్‌సియు భూముల వేలాన్ని ఆపాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డివైఎఫ్ఐ నాయకులు కార్యకర్తలు 130 మందిని అరెస్టు చేసి పోలీస్‌స్టేష‌న్ల‌కు తరలించారన్నారు. అక్రమంగా అరెస్టు చేయడాన్ని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో నియంతృత్వంగా వ్యవహరిస్తుందని విమ‌ర్శించారు. రాష్ట్ర యూనివర్సిటీ భూములను కాపాడాల‌నే దాని పైన శ్రద్ధ పెట్టాలని… అరెస్టులు, కేసులు ఉద్యమాలను ఆపలేవని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా యునివర్సిటీ భూముల వేలాన్ని అపాలని డిమాండ్ చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png