Addam News
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 2:19 am Posted by : Addam News

12వ బడ్జెట్ లోనూ తెలంగాణకు గుండు సున్నానే – కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

12వ బడ్జెట్ లోనూ తెలంగాణకు గుండు సున్నానే
» 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా తెలంగాణకు తీరని అన్యాయం
» 12 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ సర్కార్
» విభజన హామీలు సహా తెలంగాణకు రావాల్సిన నిధులపై కిక్కురుమనని ఆర్థిక మంత్రి
» మోడీ నిత్యం వల్లవేసే కో–ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా ?
– కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :   వరుసగా 12వ ఏడాది కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు గుండు సున్నానే దక్కిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ పై ఎక్స్ వేదిక స్పందించారు. పన్నేండేళ్లుగా తెలంగాణను మోసం చేయటం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆమె ట్వీట్ చేశారు. కో– ఆపరేటివ్ ఫెడరలిజం అంటూ ప్రధాని మోడీ నిత్యం చెబుతుంటారు కానీ ఆచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీలు సహా తెలంగాణ ప్రాజెక్ట్ లకు రావాల్సిన నిధులన్నింటినీ పెండింగ్ లో పెట్టారని విచారం వ్యక్తం చేశారు. స్థిరత్వం, క్రమశిక్షణ, వృద్ధి అంటూ నినాదాలు చెప్పే బీజేపీ పెద్దలు ఎందుకు తెలంగాణ విషయంలో వివక్ష చూపుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

8 మంది ఎంపీలను ఇస్తే తిరిగి ఇచ్చింది గుండుసున్న :

తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి మాత్రం గుండుసున్నా ఇచ్చారని క‌విత మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు రావాల్సిన దానికి బదులు పెండింగ్ ఫైల్స్ వస్తున్నాయన్నారు. 34 వేల 367 కోట్ల తో చేపట్టాల్సిన రీజినల్ రింగ్ రోడ్, హైవేలు, రేడియల్ రోడ్లకు నిధులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఇవ్వాల్సిన 50 శాతం నిధులు ఇవ్వలేదన్నారు. కొత్త రైల్వే లైన్స్ కు క్లియరెన్స్ లు ఇవ్వకపోగా, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని అటకెక్కించారని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణకు దక్కాల్సిన ఐఐఎం, 16 నవోదయ విద్యాలయాలు, 9 కేంద్రీయ విద్యాలయాలను ఇవ్వటం లేదన్నారు. విభజన చట్టం హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా పారిశ్రామిక ప్రోత్సహాకాలు ఏమీ ఇవ్వలేదన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయాల జాబితా చాంతాడంతా ఉందన్నారు. ప్రధాని మోడీ చెప్పే కో– ఆపరేటివ్ ఫెడరలిజం అంటే తెలంగాణ ప్రయోజనాలను కాలరాయమటేనా అని ప్రశ్నించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png