Addam News
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 9:35 am Posted by : Addam News

IND vs SA: నేడు మూడో టీ20.. గెలుస్తారా..?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికాతో 5 టీ20ల సిరీస్‌ను ఘనవిజయంతో ఆరంభించి, రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమ్‌ఇండియా.. కీలకమైన మూడో టీ20కి సిద్ధమైంది. ఆదివారం ధర్మశాలలో ఈ మ్యాచ్‌ జరగనుంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్, వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ల ఫామే భారత్‌కు అతి పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా గిల్‌ ఈ సిరీస్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతే జట్టులో చోటు గల్లంతవడం ఖాయం. బ్యాటింగ్‌ ఆర్డర్లో ప్రయోగాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జట్టు యాజమాన్యం.. ఈ మ్యాచ్‌లో ఎవరిని ఏ స్థానంలో ఆడిస్తుందన్నది ఆసక్తికరం. బారాబటిలో ఘోర పరాభవం తర్వాత, చండీగఢ్‌లో బలంగా పుంజుకున్న సఫారీ జట్టు.. ధర్మశాలలో మరో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.

జోరు కొనసాగించాలని.. తొలి టీ20లో కేవలం 74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో 213 పరుగులు చేయడం అనూహ్యం. దీంతో ఇక ఆ జట్టును భారత్‌ తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. డికాక్‌ జోరందుకుంటే ఎలా ఉంటుందో చివరి వన్డేలో, రెండో టీ20లో భారత్‌కు బాగానే అనుభవమైంది. ధర్మశాలలో పరిస్థితులు కూడా పేస్‌కు సహకరిస్తాయి కాబట్టి భారత బ్యాటర్లు జాగ్రత్త పడాల్సిందే.

గత మ్యాచ్‌లో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను మూడో స్థానంలో ఆడించిన జట్టు యాజమాన్యం.. విధ్వంసక బ్యాటర్‌ అయిన శివమ్‌ దూబెను ఎనిమిదో స్థానంలో దించింది. అక్షర్‌ 21 బంతుల్లో 21 పరుగులే చేసి ఔటయ్యాడు. దూబె 18వ ఓవర్‌ చివరి బంతికి క్రీజులోకొచ్చాడు. అప్పటికే భారత్‌ ఓటమి ఖరారైంది. 214 పరుగుల భారీ ఛేదనలో ఇదేం వ్యూహమో అర్థం కాక అభిమానులు తలలు పట్టుకున్నారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో అయినా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను సరి చేస్తారేమో చూడాలి. ధర్మశాలలో మంచి రికార్డున్న కుల్‌దీప్‌ యాదవ్‌ను తుది జట్టులో ఆడించడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png