Addam News
Newspaper Banner
Date of Publish : 23 March 2025, 11:34 pm Posted by : Addam News

అమర వీరుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేద్దాం – నటుడు డాక్ట‌ర్‌.మాదాల రవి

హైదరాబాద్, అద్దం న్యూస్ : అమర వీరుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేద్దామ‌ని నటుడు, నిర్మాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్ట‌ర్‌.మాదాల రవి అన్నారు. జీవితంలో రెండు దానాలు గొప్పవని అన్నదానం.. రక్తదానం అని.. మొదటిది సాటి మనిషి కడుపు నింపితే…రెండవది సాటి మనిషి ప్రాణాలు నిలబెడుతుందన్నారు. భ‌గ‌త్‌సింగ్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆదివారం ఎల్‌బిన‌గ‌ర్ చింత‌ల‌కుంట వాస‌వీ శ్రీ నిల‌యంలో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం, అమర వీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా నటుడు, నిర్మాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్ట‌ర్‌.మాదాల రవి, ముఖ్య అతిథిగా నటి ఉదయభాను, ప్రత్యేక అతిథిగా హైద‌రాబాద్ సిఐడి అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ మాధవీలత త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన‌ రక్తదాన శిబిరాన్ని డాక్ట‌ర్‌.మాదాల రవి ప్రారంభించారు. ఈ సంధర్బంగా మాదాల రవి మాట్లాడుతూ… రక్తదానం అనేది మనందరి కనీస బాధ్యత. ఆసుపత్రికి వెళ్ళే ప్రతి ఏడుగురిలో ఒకరికి రక్తం అవసరమవుతుంద‌ని.. కొన్నిసార్లు రక్తం దొరక్క చాలా మంది మరణిస్తున్నారన్నారు.

రక్తం మనకు ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన బహుమతి. రక్తదానం చేయడం అంటే ఓ మనిషికి జీవనదానం చేయడమే అని అన్నారు. ఈనాడు దేశ యువత భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల అమరత్వాన్ని తలచుకొని దేశం కోసం, సమైక్యత కోసం కృషి చేయాలని అన్నారు. నటి ఉదయ భాను, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్-సిఐడి మాధవీ లత మాట్లాడుతూ.. అమర వీరుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాభూమి సాహితీ సాంస్కృతిక చైతన్య వేదిక సభ్యులు నరసింహ ప్రసాద్, ఉదయశంకర్, నాగిరెడ్డి, కేశవ రావు, ఎన్ఎస్ఆర్.మూర్తి, శరణ్య, పద్మలత, అలివేలు మంగ, రఘునందన్, శంకర్ పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో 100 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png