Addam News
Newspaper Banner
Date of Publish : 23 March 2025, 1:27 am Posted by : Addam News

భగత్‌సింగ్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని న‌వ‌ సమాజాన్ని నిర్మిద్దాం

హైదరాబాద్, అద్దం న్యూస్ : భగత్‌సింగ్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని న‌వ‌ సమాజాన్ని నిర్మిద్దామ‌ని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి.అబ్బాస్ అన్నారు. సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ 94 వ వర్ధంతి సందర్భంగా బాల భగత్‌సింగ్ లంతా వేషధారణతో హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలో ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. భగత్‌సింగ్ బాటలో బాలలం మేమంతా భావిపౌరులం ఉత్తుంగ తరంగాలం – ఉద్దండ పిండాలం.. కులం లేదు.. మతం వద్దు.. సమానత్వమే సరిహద్దుగా సాగుదాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంత‌రం టిపిఎస్‌కెలో జ‌రిగిన కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా ఎండి.అబ్బాస్ హాజరై మాట్లాడుతూ… దేశం కోసం బలైన భగత్‌సింగ్‌ బాటలో భావి తరాలే భవిష్యత్తును నిర్మించాలని అన్నారు. ఆయన త్యాగధనుడే కాదు శాస్త్రీయ ఆలోచనలతో ఈ దేశ ప్రజల విముక్తి సాధన కోసం సమగ్ర అధ్యయనం చేశారన్నారు. నేటి బాలలే రేపటి భగత్‌సింగ్‌లుగా కావాలని, వారిలోని ధీరత్వం, మానవత్వం, ఎనలేని ప్రేమతత్వం, సోదరత్వం మనమంతా పెంపొందించుకోవాలని సూచించారు.

టిపిఎస్‌కె రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…త్యాగానికి వెరవని వారి వీరత్వం ఆశయం కోసం అంకితమై ప్రాణాన్ని తృణ ప్రాయంగా అర్పించిన అమరత్వం వారిది అని అన్నారు. భగత్‌సింగ్ అంటే … బాంబులు, తుపాకులు కాదని భగత్‌సింగ్‌ అంటే నిత్యం రగిలే చైతన్య‌మన్నారు. ఈ కార్యక్రమంలో టిపిఎస్‌కె హైదరాబాద్ కన్వీనర్ గుమ్మడి నరేష్, రాజయ్య గౌడ్, ఉపాధ్యాయులు వరప్రసాద్ రెడ్డి, మహిళా టిచర్స్ రుక్మిణీ, వ‌సుంధర త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png