Addam News
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 4:28 am Posted by : Addam News

జలమండలిలో ఘనంగా మహాత్ముడు పూలే జయంతి

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :    మహాత్మ జ్యోతిరావు పూలే వంటి మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జ్యోతి రావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండీ అశోక్‌రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, పూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ… మహాత్మ జ్యోతిరావు పూలే ఆ కాలంలోనే ఎంతో కాలంగా వివక్ష, అణచివేతకు గురైన వారి అభ్యున్నతికి ఆయన తోడ్పాటును అందరించారని పేర్కొన్నారు. అంటరానితనం నిర్మూలన, వివక్షకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాటం చేశారన్నారు. అలాగే మహిళలకు, ఆడపిల్లల చదువుల కోసం జ్యోతిరావు పూలే దంపతులు విశేష కృషి చేసారని కొనియడారు. చ‌దువు ద్వారానే వివ‌క్ష‌ పోయి, స‌మాన‌త్వం సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న న‌మ్మార‌ని గుర్తు చేశారు. వివ‌క్ష అనేది మ‌నుషుల్లో, మ‌న‌సుల్లో పేరుకుపోయింద‌ని, ఎవ‌రికి వారే దానిని తొల‌గించుకోవాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. కుల వివ‌క్ష అనేది పూర్తిగా దూరం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అదే జ్యోతిరావు పూలేకు అస‌లైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ- డైరెక్టర్ ( ఆపరేషన్-2 ) విఎల్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ ( ప్రాజెక్టు ) సుదర్శన్, డైరెక్టర్ ( ఆపరేషన్-1 ) అమరేందర్ రెడ్డీ, డైరెక్టర్ ( ఫైనాన్స్ ) పద్మావతి, కార్య‌క్ర‌మం కో-ఆర్డినేట‌ర్ సీజీఎం వినోద్ భార్గవ, సీజీఎంలు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, ప్రభు, చంద్ర జ్యోతి, కేదారేశ్వరి, రవీందర్ రెడ్డి, జీఎంలు, జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, జ‌ల‌మండ‌లి బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేష‌న్ యూనియ‌న్ల నాయ‌కులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png