చార్మినార్ పరిసరాల్లో వైభవంగా
మిలాద్ ఉన్ నబీ
చార్మినార్, ఆగస్టు 26, ( అద్దం న్యూస్ ) : మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్ చార్మినార్ పరిసరాల్లో నిర్వహించిన ఊరేగింపు వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నగర పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ఉన్నతాధికారులతో కలిసి చార్మినార్ వద్ద భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పర్యవేక్షించారు. ఊరేగింపు చార్మినార్ వద్దకు చేరుకోగానే ఆయన ముస్లిం మత పెద్దలను ఆత్మీయంగా పూలమాలలతో సత్కరించి, వారికి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… హైదరాబాద్ నగరం ఎల్లప్పుడూ శాంతి భద్రతలకు, పరమత సహనానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, ఇక్కడి విశిష్ట గంగా-జమునా తెహజీబ్ సంస్కృతికి ఈ వేడుకలే నిదర్శనమని కొనియాడారు. నగరంలో ఏ పండుగ జరిగినా ప్రజలు పోలీసు శాఖకు ఎంతో బాధ్యతాయుతంగా సహకరిస్తున్నారని గుర్తు చేశారు. ఈ వేడుకల నిమిత్తం సుమారు 2 వేల మంది సిబ్బందితో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఊరేగింపు మార్గంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, సాధారణ ప్రజలకు, ఇతర వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ముందస్తు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు వెల్లడించారు. నగర ఘన సంస్కృతి, సాంప్రదాయాలను నిలబెడుతూ ఈ పండుగను, ఊరేగింపును ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేసేందుకు నిర్వాహకులు, యువత, ప్రజలు పోలీసులకు మరింత సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్సీర్ ఇక్బాల్, అదనపు సీపీ క్రైమ్స్ ఎం.శ్రీనివాసులు, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, డీసీపీ టాస్క్ ఫోర్స్ వైభవ్ గైక్వాడ్, చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే ప్రభాకర్, డీసీపీ సీసీఎస్ చైతన్య కుమార్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













Leave a Reply