Addam News
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 5:38 pm Posted by : Addam News

Indiramma housing scheme : ఇందిరమ్మ ఇళ్లు పథకంలో ముషీరాబాద్ నియోజకవర్గానికి మొండిచేయి

ఇందిరమ్మ ఇళ్లు పథకంలో ముషీరాబాద్ నియోజకవర్గానికి మొండిచేయి
ముషీరాబాద్ కాంగ్రెస్ బ‌డా నేత‌లు ఆడంబ‌రాల‌కు త‌ప్ప అభివృద్ధికి ప‌నికి రారు
– తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నాయ‌కుడు రేషం మల్లేష్

హైద‌రాబాద్‌, జూలై 30, ( అద్దం న్యూస్ ) :  ఇందిరమ్మ ఇళ్లు పథకంలో ముషీరాబాద్ నియోజకవర్గానికి మొండిచెయే మిగిలింద‌ని తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నాయ‌కుడు రేషం మల్లేష్ విమ‌ర్శించారు. గురువారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్‌లోని త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో రేషం మ‌ల్లేష్ మాట్లాడుతూ…. ఇందిర‌మ్మ ప‌థ‌కం కింద పేద ప్ర‌జ‌లంద‌రికి ఇళ్లు ఇస్తామ‌ని ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో హామినిచ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రెండున్న‌రేళ్లు అవుతున్నా ఆ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆరు లక్షలు కడితేనే ఇళ్లు ఇస్తార‌ని న‌మ్మిన పేద ప్ర‌జ‌లు ప‌ది వేల రూపాయల దరఖాస్తు రుసుము చెల్లించార‌ని, ఆ పేద ప్రజలకు అందని ద్రాక్షలా ఇందిరమ్మ ఇళ్లు పథకం మారింద‌న్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బడా నేతలు ఆడంబరాలకు తప్ప అభివృద్ధికి పనికి రారని విమ‌ర్శించారు. ముషీరాబాద్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లు పథకంలో విష‌యంలో తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌న్నారు.

ఇందిరమ్మ ఇళ్లు ప‌థ‌కాన్ని ఇచ్చే ప్ర‌క్రియ‌లో అస‌లు ముషీరాబాద్ నియోజకవర్గం ఒక‌టుంది అని కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి గుర్తుందా అని ప్ర‌శ్నించారు. ఇందిర‌మ్మ ఇళ్ల కోసం ద‌ర‌ఖాస్తులు పెట్టుకున్న వారు, ఇళ్లు లేని పేద ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీర‌ని న‌ష్టం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. కెసిఆర్ ప్రభుత్వంలో ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పేద ప్ర‌జ‌ల‌కు 360 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను ఉచితంగా ఇచ్చార‌న్నారు. పేద ప్ర‌జ‌ల‌కు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను ఇచ్చిన‌ ఘనత మా బిఆర్ఎస్ ప్రభుత్వానిదేన‌ని రేషం మ‌ల్లేష్ స్ప‌ష్టం చేశారు. వెంటనే ముషీరాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు పథకం అమలు చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ విలేక‌రుల స‌మావేశంలో తెలంగాణ ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నాయ‌కులు సిరిగిరి శ్యామ్‌, క‌ల్వ‌ గోపి, అజయ్ ముదిరాజ్, చిట్టి శ్యాంసుందర్, పున్న సత్యనారాయణ, బండ జుగేందర్, శ్రీనివాస్‌, మాధవ్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png