Addam News
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 10:10 pm Posted by : Addam News

ముషీరాబాద్‌ను ఒకే స‌ర్కిల్‌గా జోన్ ఏర్పాటు చేయాలి – ముషీరాబాద్ కాంగ్రెస్ నేత‌లు

ముషీరాబాద్‌ను ఒకే స‌ర్కిల్‌గా జోన్ ఏర్పాటు చేయాలి
» ముషీరాబాద్ కాంగ్రెస్ నేత‌లు

హైదరాబాద్, డిసెంబ‌ర్ 28, అద్దం న్యూస్ :   నగరంలోనే ప్రత్యేకత ఉన్న ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన జీహెచ్ఎంసీ ముషీరాబాద్ సర్కిల్‌ను ఒకే సర్కిల్‌గా జోన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ గాంధీనగర్ డివిజన్ పార్టీ సీనియర్ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గాంధీనగర్ డివిజన్ జవహర్‌న‌గ‌ర్‌ కమ్యూనిటీహాల్ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నగర ఉపాధ్యక్షుడు శీలం సత్యనారాయణ, ల‌క్ష్మీగ‌ణ‌ప‌తి దేవాల‌యం ఛైర్మ‌న్ మారిశెట్టి న‌ర్సింగ్‌రావు లు మాట్లా డుతూ… గాంధీనగర్ డివిజ‌న్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన కవాడిగూడ సర్కిల్‌లో, సికింద్రాబాద్ జోన్‌లో విలీనం చేయడం తగదన్నారు. గాంధీనగర్ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేసి కవాడిగూడ సర్కిల్‌లో కలపడం వల్ల ఇక్కడ అనేక సమస్యలు పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నట్లుగానే ఒకే మున్సిపల్ సర్కిల్ ఉంటే బాగుంటుందన్నారు.

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని రెండు సర్కిళ్లుగా, రెండు జోన్లుగా విభజించడం సబబు కాదని వారు అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలోని ఆరు డివిజన్లు మరో జోన్ పరిధిలోకి వస్తాయని మరో మూడు డివిజన్లు సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కవాడిగూడ సర్కిల్ పరిధిలోకి వస్తాయని ఇదంతా గందరగోళ పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉందన్నారు. ఒకే నియోజకవర్గానికి ఇద్దరు జోనల్ కమిషనర్లు, డీఎంసీలు, ఇద్దరు టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీలు ఇద్దరేసి ఇతర అధికారులు వస్తారని అన్నారు. ఒక నియోజకవర్గాన్ని ఒకే సర్కిల్‌గా ఉంచితేనే మున్సిపల్ సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జ‌యేంద‌ర్‌బాబు, జగదీశ్, సురేష్ యాద‌వ్‌, బాబురావు, భాస్కర్‌రెడ్డి, రాజు, శ్రీను, విజయేష్, గుర్రం శంకర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png