Addam News
Newspaper Banner
Date of Publish : 13 April 2025, 3:16 am Posted by : Addam News

ప్ర‌శాంతంగా శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :  శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ప్ర‌శాంతంగా ముగిసింది. గౌలిగూడ‌లోని శ్రీ.రామ మందిరం నుండి ప్రారంభమై నారాయణగూడ, ఆర్టిసి చౌరస్తా, అశోక్ నగర్, కవాడిగూడా, బైబిల్ హౌస్ నుండి తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు దాదాపు 12.2 కిలో మీటర్ల మార్గంలో యాత్ర కొన‌సాగింది. న‌గ‌రంలో శ‌నివారం జ‌రిగిన శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు కట్టుదిట్టమైన బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రధాన ఊరేగింపులు సరియైన సమయానికి బయలుదేరే విధంగా నిర్వాహకుల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. అనంత‌రం సివి.ఆనంద్ మీడియాలో మాట్లాడుతూ… గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విస్తృతంగా బందోబస్తును ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. మొన్న జరిగిన శ్రీరామ నవమి శోభా యాత్రకు హైదరాబాద్ న‌గ‌ర‌ ప్రజలు, భక్తులు, నిర్వాహకుల అందరి సహాయంతో ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఈ సారి శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ప్రశాంతంగా ముగియడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, విజయ యాత్ర నిర్వాహకులతో, ఇతర మత పెద్దల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింద‌ని తెలిపారు. రాచకొండ, సైబరాబాదు పోలీసు కమిషనరేట్ పరిధిలోని విజయ యాత్రలు ముందుగానే బయలుదేరి గౌలీ గూడ ప్రధాన ఊరేగింపులో చేరాయ‌ని పేర్కొన్నారు. హైదరాబాద్‌ సిటీ పరిధిలోని కొన్ని సమస్యాత్మక, ఇతర మత ప్రార్థన స్థలాల వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యగా విహెచ్‌పి, బజరంగ్‌ద‌ళ్‌, ఇతర మత పెద్దలతో మాట్లాడి స్థానిక డిసిపి అధికారుల నేతృత్వంలో ఊరేగింపు ప్రశాంతంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. 

అన్ని శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర లను సిసి టీవిల ద్వారా, డ్రోన్ కెమెరాల ద్వారా జాయింట్ కమాండ్ కంట్రోల్‌లో పర్యవేక్షించామ‌న్నారు. హైదరాబాదు సిటీ కమిషనరేట్ పరిధిలో సుమారు 150 శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రలు, సైబరాబాదు, రాచకొండ పరిధిలో నుండి 40 విజయ యాత్రలు ఇవి అన్నియు ప్రధాన శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రలో కలిసి ముందుకు వెళ్లాయ‌న్నారు. శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు హైదరాబాద్‌ సిటీ పోలీసు తరపున 17000 మంది పోలీసులు, అదనంగా సాయుధ బలగాలతో బందోబస్తు నిర్వహించామ‌న్నారు. హైదరాబాదు సిటీ పరిధిలో నగర ప్రజలకు కానీ, విజయ యాత్ర నిర్వాహకులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర సజావుగా జరగడానికి 45 ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్ళించామ‌న్నారు. శ‌నివారం ఉదయం నుండి హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయము, ఐసిసిసి భవనమం, బంజారాహిల్స్‌లో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందులో వివిధ శాఖల అధికారులు జిహెచ్ఎంసి, ఆర్ అండ్ బి, ఫైర్ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ, ఈఎంఆర్ఐ, టిజి ఆర్టీసి, హెచ్ఎండ‌బ్ల్యుఎస్ అండ్ సివ‌రేజి బోర్డు, రవాణా శాఖ, ఆరోగ్య, వైద్య శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png