Addam News
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 8:26 am Posted by : Addam News

గిల్‌ రీఎంట్రీ..? ఫాంలోకి రో-కో

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమిండియా టెస్టు, వన్డే సారథి శుబ్‌మన్‌ గిల్‌ ఫాంలోకి వచ్చే టైం వచ్చేసిందా. సౌతాఫ్రికాతో ఇటీవల జరిగిన సిరీస్ లలో గిల్‌కు ఆశించిన స్థాయిలో ఆడలేదు. తమ మార్క్ బ్యాటింగ్ ఎక్కడా కూడా కనబడలేదు. అనంతరం గాయాల భారిన పడి రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని టీ20 సిరీస్‌కు వచ్చినా అతని బ్యాట్ నుంచి ఆశించిన స్కోర్ రాలేదు. దీంతో అతడ్ని పక్కనబెట్టారు. అయితే ఇప్పుడు మళ్లీ గిల్ ఫాంలోకి వచ్చే అవకాశం వచ్చింది. విజయ్‌ హజారే ట్రోఫీ తనకు వరంలా మారబోతుంది. విజయ్‌ హజారే ట్రోఫీ టోర్నీలో సత్తా చాటి తిరిగి ఫామ్‌లోకి రావాలని గిల్‌ భావిస్తున్నాడు. ఫాం కోల్పోయి అవకాశం కోసం ఎదురుచూస్తున్న స్టార్ ప్లేయర్లంతా విజయ్‌ హజారే ట్రోఫీలో రాణించి తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని తహతహలాడుతున్నారు.

ఇందులో భాగంగా రిషభ్‌ పంత్‌ ఢిల్లీ టీంకు సారథిగా ఉన్నాడు. ఇక నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా ఉండగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ మహారాష్ట్ర, సర్ఫరాజ్‌ ఖాన్‌ ముంబై, దేవదత్‌ పడిక్కల్‌ కర్ణాటక తరఫున ఇప్పటికే తమ మార్క్ ప్రదర్శన ఇచ్చేస్తున్నారు. ఇక భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి ఢిల్లీ టీంకు, రోహిత్‌ శర్మ ముంబై తరఫున ఈ టోర్నీలో రెండేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు. అభిషేక్‌ శర్మ సైతం పంజాబ్‌ తరఫున బరిలోకి దిగాడు.

మరోవైపు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. జనవరి 6,8వ తేదీల్లో గుజరాత్‌, సర్వీసెస్‌ జట్లతో జరిగే మ్యాచ్‌లలో సౌరాష్ట్రకు జడ్డూ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇక కర్ణాటక తరఫున వికెట్ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 3, 6 తేదీల్లో త్రిపుర, రాజస్తాన్‌ జట్లతో ఆడబోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌ లో కోహ్లి, రోహిత్‌, గిల్,జడేజా, కేఎల్‌ రాహుల్‌ బరిలో దిగనున్నారు. స్వదేశంలో కివీస్‌తో టీమిండియా మూడు వన్డే, ఐదు టీ20లు ఆడనుంది. జనవరి 11న గుజరాత్ లోని వడోదరా స్టేడియంలో తొలి వన్డే జరగబోతుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png