Addam News
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 12:16 pm Posted by : Addam News

Ro-Co: ‘వన్డే వరల్డ్‌ కప్‌ 2027 ఆడాలి’

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమ్‌ఇండియా క్రికెట్‌లో కీలక బ్యాటర్లు అయిన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)ల (Ro-Co) భవితవ్యంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ టిమ్ సౌథీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు 2027లో జరగబోయే వన్డే వరల్డ్‌ కప్‌లో ఖచ్చితంగా ఆడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రోహిత్, కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం వారు కేవలం వన్డేలపైనే దృష్టి సారించారు. ఇటీవల కాలంలో వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తుండటమే సౌథీ ఈ వాదనకు బలం చేకూర్చింది.

అద్భుతమైన ఫామ్‌లో స్టార్ బ్యాటర్లు

విరాట్ కోహ్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో రెండు డకౌట్ల తర్వాత, మూడో వన్డేలో హాఫ్‌సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రాంచీ మరియు రాయ్‌పుర్‌లలో వరుసగా సెంచరీలు బాది తన క్లాస్‌ను నిరూపించుకున్నారు.

రోహిత్ శర్మ: ఆస్ట్రేలియా టూర్‌లో సెంచరీ, దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో హాఫ్‌సెంచరీ సాధించి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ 1వ స్థానంలో, విరాట్ కోహ్లీ 4వ స్థానంలో ఉండటం వారి నిలకడకు నిదర్శనం.

వయసు కేవలం సంఖ్య మాత్రమే: టిమ్ సౌథీ

కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై టిమ్ సౌథీ మాట్లాడుతూ.. “వన్డేల్లో విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను ఇప్పటికీ అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాంటప్పుడు 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో ఎందుకు ఆడించకూడదు? రోహిత్ కూడా అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నాడు. వారు బాగా ఆడినంత కాలం జట్టులో కొనసాగాల్సిందే. నా దృష్టిలో వయసు పెద్ద విషయం కాదు, అది జస్ట్‌ నంబర్‌ మాత్రమే” అని నొక్కి చెప్పారు. ప్రస్తుతం టెస్టుల్లో సీనియర్లు లేక టీమ్ ఇండియా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, రో-కో జోడి 2027 వరల్డ్‌ కప్‌లో ఆడటం భారత్‌కు విజయావకాశాలను పెంచుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png