Addam News
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 7:01 am Posted by : Addam News

నిర్మల్ జిల్లాలో విషాదం.. సర్పంచి అభ్యర్థి భర్త ఆత్మహత్య

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రాజకీయ ఒత్తిళ్లు ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేశాయి. నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ (సోమార్‌పేట్) గ్రామంలో సర్పంచిగా పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త బండారి రవీందర్‌ (54) గురువారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గ్రామస్థులు, ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం… గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా, నీటి సంఘం ఛైర్మన్‌గా పనిచేసిన రవీందర్, ఇటీవల (నెల 29న) భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీలో చేరారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఎర్వచింతల్ సర్పంచి పదవి బీసీ-మహిళకు కేటాయించబడటంతో, ఆయన తన భార్య పుష్పను అభ్యర్థిగా నామినేషన్ వేయించి పోటీలో నిలిపారు. అయితే, ఎన్నికల ప్రక్రియలో తలెత్తిన రాజకీయ ఒత్తిళ్లు, పరిణామాలను తట్టుకోలేక రవీందర్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున ఆయన ఇంట్లో ఉరివేసుకుని కనిపించారు.

భర్త మరణానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని పేర్కొంటూ భార్య పుష్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య పుష్పతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రజా జీవితంలో చురుకుగా ఉన్న వ్యక్తి బలవన్మరణానికి పాల్పడటం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png