Addam News
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 8:45 pm Posted by : Addam News

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి… రాయితీని పొందండి – ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి… రాయితీని పొందండి
» ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు

హైదరాబాద్, మార్చి 27, అద్దం న్యూస్ :   పెట్రోల్, డీజిల్ ఇంధనం కొరత భయాందోళనల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి రాయితీని ప్రకటించారు. ఈ మేర‌కు టిజిఎస్ ఆర్టీసీ ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు శుక్ర‌వారం మాట్లాడుతూ…పెట్రోల్, డీజిల్ ఇంధనం కొరత భయాందోళనల నేపథ్యంలో ప్ర‌జ‌లంద‌రూ త‌మ తమ వాహ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టి ఆర్టీసీ సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని కోరారు. ముషీరాబాద్‌ డిపోకు చెందిన పలు బస్సులను ప్రజల సౌకర్యార్థం నగరంలోని పలు రద్దీ రూట్లలో నడుపుతున్నామ‌న్నారు. తద్వారా ఇంధనం సంబంధిత ఇబ్బందులను ప్రజలు అధిగమించడమే కాకుండా ఆర్టీసీకి సైతం ఆదాయం చేకూరుతుందన్నారు. ఉభయతారకర మైన ఆర్టీసీ రాయితీపై విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు.

టికెట్ పై 30 శాతం తగ్గింపు :

పెట్రోల్ బంక్ వద్ద ఇందనం కోసం బారులు కని పిస్తున్న నేపథ్యంలో నగరంలోని మెట్రో ఎక్స్ ప్రెస్, డీలక్స్, ఏసీ బస్సులలో ప్రయాణించే వారి కోసం 30 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఇప్ప‌టికే ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారని డిపో మేనేజ‌ర్ ర‌ఘు తెలిపారు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూలైన్లలో గంటల కొద్ది నిరీక్షించే బదులు రాయితీ టికెట్లను సద్వినియోగం చేసుకుంటూ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని కోరారు. తద్వారా ఇంధనం పొదుపుతో పాటు నగరంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి సైతం తమ వంతు సహకారం అందించినవార‌వుతార‌ని తెలిపారు.

అగ్రస్థానంలో ఆర్టీసీ ర‌వాణా సేవ‌లు :

నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ మొదటి స్థానంలో కొనసాగుతోందని డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యో గులు, విద్యార్థులతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు సంబంధిత బస్సులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, ప్రయాణి కులకు ఇబ్బందుల్లేకుండా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా రెండు షిఫ్టులలో విధులను నిర్వహిస్తున్నారని ఆయ‌న చెప్పారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png