Addam News
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 3:40 am Posted by : Addam News

కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం

కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం
– ధ‌ర్నాచౌక్‌లో జ‌రిగిన నిర‌స‌న‌లో వ‌క్త‌లు

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 13, ( అద్దం న్యూస్ ) :   దళితులపై వివక్ష, అవమానకర చర్యలను సహించబోమని ప‌లువురు వ‌క్త‌లు స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకు ఐక్యంగా ఉద్యమించాలని వ‌క్త‌లు పిలుపునిచ్చారు. తెలంగాణ‌ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ ప్రసాద్‌ రావుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం హైద‌రాబాద్‌ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య అధ్యక్షతన జరిగిన ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తుగా ఎంపి మ‌ల్లు ర‌వి, ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం, ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీలు కోదండ‌రామ్‌, అద్దంకి దయాకర్‌, ప్రొఫెసర్లు హరగోపాల్‌, పురుషోత్తం, మాల మ‌హానాడు అధ్య‌క్షుడు చెన్నయ్య, మాజీ చైర్మ‌న్‌ పిడమర్తి రవి, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ట్రైకార్ కార్పోరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, సతీష్‌, రాజు, దరువు ఎల్లన్న తదితరులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఎంపి మ‌ల్లు ర‌వి మాట్లాడుతూ… కుల వివక్షకు సంబంధించిన ఘటనల్లో పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాలు కలిసి పోరాడాలని కోరారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో అడ్డుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ… చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కులం పేరుతో వివక్ష, అవమానానికి గురిచేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఎమ్మెల్సి అద్దంకి ద‌యాక‌ర్ మాట్లాడుతూ… కెసిఆర్ ద‌ళిత ద్రోహి అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png