Addam News
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 12:37 pm Posted by : Addam News

ఒకదాన్నొకటి ఢీకొన్న వాహనాలు

ఒకదాన్నొకటి ఢీకొన్న వాహనాలు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఉత్తరాదిన పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున లఖ్‌నవూ- వారణాసి హైవేపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అమేఠీ జిల్లాలోని హైవేపై దట్టమైన పొగమంచు (Dense Fog) కారణంగా రోడ్డు పక్కన రెయిలింగ్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టిందని స్థానిక పోలీస్‌ అధికారి తెలిపారు. తర్వాత దెబ్బతిన్న ఆ ట్రక్కును వెనక నుంచి వచ్చిన మరో మూడు ట్రక్కులు, ఒక కారు, బస్సు ఒకదానిని ఒకటి ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని.. మరో 16 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. హైవేపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తగా.. వాటిని క్రమబద్దీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలోని దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఉత్తరాదిలో అతిశీతల పరిస్థితులు

ఇక, దేశ రాజధాని దిల్లీ (Delhi) లో గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ తగ్గడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇక్కడి గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 413గా ఉంది. కేంద్ర కాలుష్య నియంత్ర మండలి (CPCB) ప్రకారం.. అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘తీవ్రమైన’ స్థాయికి చేరుకుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png