హైదరాబాద్, నవంబర్ 10, అద్దం న్యూస్ : ప్రఖ్యాత తెలుగు కవి, గేయ రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” సృష్టికర్త అందెశ్రీ మృతి తెలంగాణ సాహిత్య లోకానికి అపారమైన నష్టం, తీరని లోటు అని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ప్రఖ్యాత తెలుగు కవి, గేయ రచయిత, అందెశ్రీ ( 64 ) సోమవారం గుండె పోటుతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూయడం బాధాకరమన్నారు. పేదరికం, నిరక్షరాస్యత నుండి స్వయంకృషితో ఎదిగి, సమకాలీన తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రభావవంతమైన వారిలో ఒకరిగా నిలిచారన్నారు. ఆయన రచించిన రాష్ట్ర గీతం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసిందని, 2024 లో అధికారికంగా గుర్తించబడిందన్నారు. రైతులు, కార్మికులు మరియు అట్టడుగు వర్గాల పోరాటాలపై ఆయన చేసిన రచనలు విస్తృత ప్రశంసలు పొందాయని, ఆయన సాహిత్య సేవలకు అనేక పురస్కారాలు, గౌరవ డాక్టరేట్ లభించాయన్నారు.
ఆ మహానీయుని పేరు మీద చిరస్థాయిగా గుర్తుండేలా ఏదైనా కళాపీఠానికి గాని తెలంగాణలోని ఏదైనా విద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి ఏమి ఆశించకుండా, ఎటువంటి ఫలాపేక్ష లేని నిజమైన తెలంగాణ వాది అని, ఆయన రాసిన తెలంగాణ పాట రాష్ట్ర గీతం తెలంగాణ పౌరుషానికి ప్రతీకగా, తెలంగాణ సాహిత్య లోకానికి నిష్కల్మషాన్ని తన పాట ద్వారా అందిచారని అన్నారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. 1961 జూలై 18 న సిద్దిపేట జిల్లా ( పూర్వపు వరంగల్ ) రేబర్తి గ్రామంలో జన్మించారని, చిన్నతనంలోనే అనాథగా మారిన అందె శ్రీ, ఎలాంటి అధికారిక విద్యను అభ్యసించలేదన్నారు. జీవనోపాధి కోసం గొర్రెల కాపరిగా, నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేశారని, ఎన్నో కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆయన స్వయంకృషితో చదువుకుని, తన కళ పట్ల అంకితభావంతో సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక ప్రముఖ వ్యక్తిగా ఎదిగారని కొనియాడారు.
ఆయన అసాధారణమైన సేవలకు గాను అనేక పురస్కారాలు అందుకున్నారని, కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, 2006 ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం, 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహిత్య పురస్కారం- రావూరి భరద్వాజ సాహిత్య పురస్కారం, 2022లో జనకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం, జూన్ 2025 లో రాష్ట్ర నగదు పురస్కారం ( రూ.1 కోటి ) అందుకున్నారని సాయిబాబా తెలిపారు. ఆయన రాష్ట్ర గీతంతో పాటు, వందలాది సామాజిక చైతన్య కవితలు, సినిమా పాటలను రచించారన్నారు. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు” ఎర్ర సముద్రం సినిమాలో రాసిన ఈ పాట విమర్శకుల ప్రశంసలు పొందిందన్నారు. 2009 నుండి ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం డిగ్రీ రెండవ సంవత్సరం తెలుగు సిలబస్లో ఈ పాటను చేర్చారని, ఆయన ఆశు కవి ( ఆశువుగా కవిత్వం చెప్పేవాడు ) గా ప్రసిద్ధి చెందారన్నారు. రైతులు, కార్మికులు, అణగారిన వర్గాల పోరాటాలను ప్రతిబింబించే విప్లవాత్మక పద్యాలకు ఆయన ఎంతో ప్రసిద్ది చెందారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు నల్లెల్ల కిషోర్, బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, భానుప్రకాష్, కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply