ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం

ప్రతి నియోజకవర్గంలో
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం
– ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌, జూలై 13, ( అద్దం న్యూస్ ) :   ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ( YIIRS ) నిర్మిస్తున్నామని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ కిషోర్ మక్వానా సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్ సభ్యులతో కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలను జాతీయ ఎస్సీ కమిషన్ ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. ప్రధానంగా విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు రాష్ట్రంలో కీలక చర్యలు చేపట్టామని తెలిపారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేశామని, విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ స్కూల్‌లోనే అందిస్తున్నామని, రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

మొదటగా కోర్ అర్బన్ రీజియన్‌లో వీలైనన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలను కల్పిస్తున్నామని, రాజకీయాల్లో, ఇతర రంగాల్లో కీలక స్థానాల్లో ఎస్సీలకు అవకాశాలు కల్పించిన విషయాలను ప్రస్తావించారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పూర్తి చేసి అమలు చేస్తున్నామని చెప్పారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం రాష్ట్రానికి కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, డీజీపీ సీవీ ఆనంద్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

 

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page