హైదరాబాద్, జూన్ 27, అద్దం న్యూస్ : భారత దేశంలో ఒక పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి తెలంగాణ జాగృతి కవితకు లేదని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అన్నారు. బనకచర్ల వ్యవహారంపై స్పందిస్తూ మాట్లాడిన కవిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… లిక్కర్ స్కాములో తెలంగాణ పరువు తీసి తీహార్ జైలులో చిప్పకూడు తిన్న కవిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై విమర్శలకు దిగడం అవివేకమన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద నీటిని, రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఎపి ప్రభుత్వం పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు నిర్మించి, రాష్ట్రం జల స్వావలంబన దిశగా చేస్తున్న ప్రయత్నంలో రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ విమర్శ, ప్రతి విమర్శలు ప్రజలకు తెలిసే విధంగా దీనిపై అర్థవంతమైన చర్చ జరగాలని అన్నారు. ఇవేమి పట్టించుకోకుండా మనది మంగళవారం.. మందిది సోమవారం అన్నట్లు బిఆర్ఎస్ చేస్తున్న విమర్శలలో పస లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదన్న కవిత విమర్శలు సరికావని, కేంద్ర జలశక్తి వనరుల శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కూడా ఫిర్యాదులు చేశారని.. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు న్యాయస్థానాలు కూడా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ పక్కన పెట్టి బనకచర్లపై రాజకీయంగా లబ్ధి పొందేందుకు కవిత మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదమని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడిని విమర్శించే ముందు కవిత ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. లిక్కర్ రాణి కవిత రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నంలో తన కుటుంబాన్ని కూడా వదల్లేదన్నారు. రాయలసీమను రతనాలసీమగా మార్చుతానన్నది కెసిఆర్ కాదా ? అని ప్రశ్నించారు. ఆంధ్ర పర్యటనలో ఆనాడు చేసిన వాగ్దానాలు హామీలు మరిచిపోయారా ? అని అన్నారు. కాలేశ్వరం అక్రమాలపై మీ తండ్రి కేసీఆర్, హరీష్ రావులపై నోరు విప్పితే బాగుంటుందని, అన్నకేటీఆర్ ఫార్ములా రేస్, డ్రగ్స్ మాఫియా, ఫోను ట్యాపింగులపై కవిత స్పందిస్తే ప్రజలు హర్షిస్తారన్నారు. లిక్కర్ స్కాములో తీహార్ జైలు పాలైన నువ్వ చంద్రబాబు పై వెర్రి గంతులు వేయడం విచారకరమన్నారు. చంద్రబాబుకే పక్షపాత ధోరణి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. చంద్రబాబుకు 2 రాష్ట్రాలు 2 కళ్ళ లాంటివన్నారని.. వచ్చిన తెలంగాణను దోచుకున్న దెవరు ? ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వస్తే బిఆర్ఎస్ పార్టీకి మనగడ లేదనే భయంతో చంద్రబాబును పథకం ప్రకారం బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై అప్రతిష్ట పాలు చేస్తున్నారన్నారు. వృధా నీటిని వాడుకుంటామన్న చంద్రబాబు మాటలకు పెడర్ధాలు తీసి ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య అపోహలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపు కోవాలని కవిత ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల్లోకి నెట్టిన కెసీఆర్ పాలన గురించి ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారన్నారు. మీ తండ్రి కెసిఆర్ లాంటి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెలకిషోర్, బాలరాజ్ గౌడ్, నాయకులు ఎస్.ప్రకాష్, కిరణ్, శ్యామ్ సుందర్, అనిల్ కురుమ తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply