సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్రెడ్డి
పేద వారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించాం – ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : పేద వారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరిగిన బహిరంగ సభ వేదికగా అశేష ప్రజానీకం సమక్షంలో ముఖ్యమంత్రి సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ .. రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మందికి ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తామని, అందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తోందన్నారు. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం అని అన్నారు. ఏ ప్రభుత్వాలున్నా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయలేరన్నారు. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం అని, పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. పేదలు దొడ్డు బియ్యం తినలేరని.. పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు సైక్లింగ్ చేస్తున్నారని తెలిపారు. ఈ గడ్డ మీద నుంచి ప్రారంభించిన పథకాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా పకడ్బందీగా అమలు చేసి పేదవారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉందని… రైతుల శ్రమ ఎక్కడికీ పోదన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేశామన్నారు. మొదట్లోనే 7,625 కోట్ల మేరకు రైతు భరోసా చెల్లించామని.. రైతు భరోసా 10 వేల నుంచి 12 వేలకు పెంచామని రేవంత్రెడ్డి అన్నారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా సన్నబియ్యం పండిస్తున్నారని.. సన్నవడ్లకు బోనస్, అత్యధికంగా రైతు రుణమాఫీ ఈ జిల్లాలోనే జరిగిందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ నల్గొండ ప్రాంతం చైతన్యానికి, పోరాటాలకు మారుపేరు అని అన్నారు. అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా నిలబడుతుందని అన్నారు. మీ సహకారంతో పదేళ్లలో తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా, దేశానికి నంబర్ 1 గా ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ వేదికగా స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ముఖ్యమంత్రి 26.10 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు హుజూర్ నగర్కు వ్యవసాయ కళాశాల, మిర్యాలగూడకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.













Leave a Reply