అంబర్పేట్, అద్దం న్యూస్ : భక్తిభావం వెల్లివిరిసింది. జై కృష్ణ జై జై నినాదాలు మిన్నంటాయి. కలియుగ కృష్ణుడిగా భావించే శ్యామ్ బాబా మహాభారత యుద్ధంలో తన శిరస్సును శ్రీకృష్ణ భగవానుడికి దానమిచ్చే రోజుగా చెప్పుకునే ‘ఫాల్గుణి మేళా’ వేడుకలు అంగరంగ వైభవం గా జరిగాయి. రంగు రంగుల జెండాలు చేతబట్టి రంగులు చల్లుకుంటూ కృష్ణుడి చిత్రపటాల ప్రదర్శన, బ్యాండ్ మేళాలు, భజన కీర్తనలు, యువతీ యువకులు, భక్తుల నృ త్యాలతో సాగిన ‘నిషాన్’ శోభా యాత్రలు అంబరాన్నంటాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో వీరన్నగుట్టపై ఉన్న శ్యామ్ బాబా ఆలయానికి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కృష్ణ నామ స్మరణతో మార్మోగాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీశ్యామ్ మందిర్కు తరలి వచ్చిన భక్తులకు భక్తులకు శ్రీశ్యామ్ బాబా సేవా మందిర్ సమితి ప్రతినిధులు ఇంద్రకిరణ్ ఆగర్వాల్, రాందేవ్ ఆగర్వాల్, రాజువిగ్, స్థానిక నాయకులు, పలువురు ప్రముఖులు కాచిగూడ పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద ఘనంగా స్వాగత ఏర్పాట్లను చేసి వారికి పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంలోని చార్మినార్, మలక్పేట, గుల్జార్ హౌజ్, పత్తర్ గట్టి, బేగంబజార్, బహదూర్పుర, ఇసామియాబజార్, రామంతాపూర్, సికింద్రాబాద్, మౌలాలీ తదితర ప్రాంతాల నుంచి నిషాన్ యాత్రలు సాగాయి. చిన్నా పెద్ద, పేద, ధనిక, కులం మతం, పురుషులు, మహిళలు అనే భేదభావం లేకుండా అందరూ కలిసికట్టుగా చే సిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

