మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ కు ఆహ్వానం
హైదరాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 15, ( అద్దం న్యూస్ ) : ఈ నెల 19వ తేదీన నెదర్లాండ్ లోని ఆమ్ స్టార్ డమ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఫెస్టివల్ అండ్ సౌత్ ఏషియా శానిటేషన్ వర్క్ షాప్ కు హాజరుకావాలని జీహెచ్ఎంసీలో ఐఎన్టియూసి గుర్తింపు పొందిన మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన త్వరలోనే నెదర్లాండ్కు పయనం కానున్నారు. ఆదిల్ షరీఫ్ ఇండియన్ నేషనల్ మున్సిపల్, లోకల్ బాడీస్ వర్కర్స్ ఫెడరేషన్ ( ఐఎన్టియూసి ) కి అధ్యక్షుడిగా కూడా వ్యవహారిస్తున్నారు. ఫెడరేటీ నెదర్లాండ్స్ వక్బేవేగింగ్ సంస్థ ఈ మేరకు ఆయన ఆహ్వాన పత్రాన్ని పంపింది. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న ఈ వర్క్ షాప్ లో చివరి రోజైన 19వ తేదీన జరగనున్న సౌత్ ఏషియా శానిటేషన్ వర్క్ షాప్ కు ఆయన హాజరై, మన దేశంలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం దేశ వ్యాప్తంగా మహానగరాలు అనుసరిస్తున్న విధానాలను ఆయన వర్క్ షాప్ లో వివరించనున్నట్లు ఆయన తెలిపారు. వివిధ దేశాల నుంచి ఈ వర్క్ షాప్ కు హాజరుకానున్న కార్మిక సంఘాల నేతలు, నిపుణలు మెరుగైన పారిశుద్ధ్యంతో పాటు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి అమలు చేస్తున్న విధానాలపై విస్తృతంగా చర్చించి, అనుభవాలను పంచుకోనున్నట్లు ఆయన తెలిపారు.
ఆదిల్ షరీఫ్ ను ప్రత్యేకంగా సౌత్ ఏషియన్ శానిటేషన్ వర్క్ షాప్ కు ఆహ్వానించినట్లు ఆహ్వాన పత్రంలో సదరు సంస్థ పేర్కొంది. ఈ సందర్భంగా ఆదిల్ షరీఫ్ మాట్లాడుతూ… ప్రస్తుత ఐఎన్టియూసి ఆలిండియా అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న తనకు యూనియన్ తరపున చేసిన కృషికి ఈ ఆహ్వానం లభించిందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై పారిశుద్ధ్యం మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలను వివరించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా కార్మికులకు జీతాల చెల్లింపులు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతతో పాటు వృత్తి పరంగా వారికి సేఫ్టీ మెజర్స్ వంటి అంశాలపై గళం విన్పించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం శానిటేషన్ విభాగంలో అతి ముఖ్యమైన విధులు నిర్వహిస్తున్న కార్మికులందర్నీ ఔట్ సోర్స్ ప్రాతిపదికన నియమించుకున్నందున వారిలో ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఎలాంటి నమ్మకం లేదని, వారిలో మరింత నమ్మకాన్ని కల్గించి, వారు మరింత మెరుగుగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా చేపట్టాల్సిన చర్యలను అంతర్జాతీయ వేదికపై వివరించనున్నట్లు ఆదిల్ తెలిపారు.














Leave a Reply