దేశ వ్యాప్తంగా ఈ నెల‌ 25ను ఆందోళన దినంగా పాటించ‌నున్న బిఎంఎస్‌

దేశ వ్యాప్తంగా ఈ నెల‌ 25ను ఆందోళన దినంగా పాటించ‌నున్న బిఎంఎస్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 23, అద్దం న్యూస్ :   దేశ వ్యాప్తంగా ఈ నెల‌ 25న ఆదోళన దినంగా భారతీయ మజ్జూర్ సంఘ్ ( బిఎంఎస్ ) ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ గాంధీన‌గ‌ర్‌లోని బిఎంఎస్ రాష్ట్ర కార్యాల‌యంలో సోమ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో తెలంగాణ బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. రాంరెడ్డి, హైదరాబాద్ జిల్లా బిఎంఎస్ అధ్యక్షుడు రాధా కృష్ణ, బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.రమేష్, జీహెచ్ఎంసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి తర్లపల్లి కృష్ణ తో క‌లిసి బిఎంఎస్ అఖిల భారత అధ్యక్షుడు ఎస్.మల్లేశం మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్లేశం మాట్లాడుతూ… భారతీయ మజ్జూర్ సంఘ్ ( బిఎంఎస్ ) పూరి, ఒడిశాలో జరిగిన 21వ అఖిల భారతీయ మహాసభల పిలుపు మేరకు ఈ నెల‌ 25న దేశవ్యాప్తంగా ” ఆందోళన దినం ” గా పాటించనుందన్నారు. ఈ సందర్భంగా దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలలో బీఎంఎస్ యూనిట్లు ధర్నాలు, నిరసనలు నిర్వహించి వివిధ రంగాలలో, పరిశ్రమలలో కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేనున్నాయన్నారు. కార్మికుల పలు అతి ముఖ్యమైన సమస్యలను బీఎంఎస్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి వరుసగా తీసుకువస్తూ వచ్చినప్పటికీ, ప్రభుత్వ స్పందన తగిన స్థాయిలో లేదని ఆవేదన వ్యక్తం చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

లక్షలాది మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్లు అతి తక్కువ పారితోషికంతోనే పనిచేస్తున్నారని, ఐదు దశాబ్దాలుగా సేవ చేసినప్పటికీ ఆంగన్వాడీ కార్మికులు ఇంకా ” స్కీమ్ కార్మికులు ” గానే పరిగణించ బడుతున్నారని పేర్కొన్నారు. రోజుకు 10 గంటలకు పైగా పనిచేస్తూ, అదనపు బాధ్యతలు పెరుగుతున్నా, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ గౌరవ వేతనం పెంపుపై ముందడుగు వేయడం లేదన్నారు.

ఎనిమిది రాష్ట్రాల్లోని నేషనల్ టెక్స్ టైల్స్ కార్పొరేషన్ మిల్లుల కార్మికులు కరోనా మహమ్మారి తరువాత నుండి కేవలం 50 శాతం వేతనాలు మాత్రమే పొందుతున్నారని… వాటిలో కూడా గత పది నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాంచీలోని హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు గత 32 నెలలుగా జీతాలు పొందలేదన్నారు. ఈపిఎస్-95 కింద కనీస పెన్షన్ రూ.1,000గా యథాతథంగా ఉండటం వల్ల లక్షలాది పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని విధానం అమలుకు ఆందోళన చేయాల్సి వస్తోందన్నారు. ఈ తీవ్రమైన సమస్యల దృష్ట్యా దేశ వ్యాప్తంగా బీఎంఎస్ యూనిట్లు ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, గేట్ మీటింగులు నిర్వహించి, నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్రధానమంత్రికి, కేంద్ర కార్మికశాఖ మంత్రికి. రాష్ట్ర ముఖ్యమంత్రులకు వినతిపత్రాలను స‌మ‌ర్పించ‌నున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

అంత్యోదయ భావనకు అనుగుణంగా అన్ని రంగాల్లో, అన్ని వర్గాల కార్మికులకు కార్మిక చట్టాల కఠిన మరియు సమగ్రంగా అమలు జరగాలని, లేబర్ కోడ్‌ల‌లో సవరణలు చేయాల‌ని, ఇండియ‌న్ లేబ‌ర్ కాన్ఫ‌రెన్స్‌ను త‌క్ష‌ణ‌మే నిర్వ‌హించి, వివిధ త్రై పాక్షిక కమిటీలను పునర్వ్యవస్థీకరించి, సమర్ధవంతంగా, నియమితంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈఎస్ఎల్‌, ఈఎపిఎఫ్ క‌వ‌రేజి ప‌రిమితుల‌ను పెంచి మ‌రింత మంది కార్మికుల‌కు ప్ర‌యోజ‌న‌గాలు అందేలా చేయాల‌ని డిమాండ్ చేశారు. పేమెంట్ ఆఫ్ బోన‌స్ యాక్ట్‌- 1965 ప్రకారం బోనస్ చెల్లింపుకు ఉన్న అర్హత పరిమితిని ప్రస్తుత వేతన స్థాయిలకు అనుగుణంగా పెంచాలన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16, 21 సూత్రాలకు అనుగుణంగా పథక కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులను స్థిరీకరించాలని మల్లేశం డిమాండ్ చేశారు. దేశాభివృద్ధి, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దీర్ఘకాల డిమాండ్లపై సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page