ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
పేదలపై బీజేపీ సర్కార్‌ది కక్షపూరిత వైఖరి
 తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు ?
మోడీతో కొట్లాడి ఉపాధి హామీకి రావాల్సిన నిధులు తీసుకురావాలి
– తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ :  ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల మీద కక్ష గట్టినట్లు వ్యవహరిస్తూ వారి నోటి కాడి కూడు లాగేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఈ మేరకు వీడియో సందేశం రిలీజ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి పని దినాలు తగ్గించటం, నిధులు ఇవ్వకపోవటంపై మోడీ సర్కార్ ను గట్టిగా నిలదీస్తూ ఆమె వీడియో సందేశం రిలీజ్ చేశారు. పేదలకు మేలు చేసే ఉద్దేశంతో తెచ్చుకున్న ఉపాధి హామీ పథకాన్ని పథకం ప్రకారం తొలగించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి చట్టబద్దత లేకుండా చేశారని మండిపడ్డారు. చట్టబద్ధత ఉంటే నిధులు ఇవ్వడం తప్పనిసరి అవుతుందని కానీ ఈ పథకాన్ని ఒక ప్రొగ్రామ్ గా మార్చేసి నిధులు ఇవ్వకుండా పేదలకు అన్యాయం చేస్తున్నారన్నారు. భవిష్యత్ లో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన కూడా అడిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిధులు ఇవ్వ‌కుండా పేద‌ల క‌డుపు కొడుతున్నారు :

ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత మెరుగుపడిందని కవిత చెప్పారు. అలాంటి ఈ పథకం పని దినాలను తగ్గించటం, నిధులు ఇవ్వకుండా చేయటం ద్వారా గ్రామాల్లో పేదల కడుపు కొడుతున్నారన్నారు. తెలంగాణలో కొవిడ్ తర్వాత 2021-22 లో 14 కోట్ల పని దినాలు ఉంటే గతేడాది 7 కోట్లకు పని దినాలను తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ఉపాధి హామీలో పని దినాలు కల్పించే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారన్నారు. వారికి ఉద్యోగ భద్రతతో, కార్మిక చట్టాలను అమలు చేయాలని క‌విత డిమాండ్ చేశారు.

బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు ?

తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే…వారు ప్రజల కోసం ఏం చేస్తున్నారని క‌విత‌ ప్రశ్నించారు. పేద ప్రజల నోటికాడి కూడు లాగేస్తుంటే బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అన్యాయమన్నారు. తక్షణమే కేంద్రంలోని వారి ప్రభుత్వంతో కొట్లాడి ఉపాధి హామీకి రావాల్సిన నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరువు కాలంలో గ్రామాల్లో పేదలను ఆదుకున్న ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page