బైక్ యాత్రను ప్రారంభించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, జూన్ 11, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్లోని కలాధర్నగర్ కాలనీ అధ్యక్షుడు మెట్టు వాసు, మెట్టు పద్మావతి దంపతుల కుమార్తె అరోరా డీమ్డ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ విద్యనభ్యసిస్తున్న మెట్టు భాంధవి హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా లడాఖ్ వరకు నిర్వహించనున్నారు. “ బైక్ అండ్ టూరింగ్ కంపెనీ ” “ మ్యాడ్ ఓవర్ లడాఖ్ ” సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో 10 మంది రైడర్లు పాల్గొంటుండగా, హైదరాబాద్ బృందం నుంచి సుప్రియా, కార్తీక్, కైవల్య, మౌనిక, నవ్య, పల్లవి తదితరులు భాగస్వాములు కానున్నారు. గురువారం ఈ యాత్రను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భాంధవి చేపట్టిన యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నేటి యువత కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని, మెట్టు భాంధవి చేపట్టిన ఈ సాహస యాత్ర యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, ముఖ్యంగా యువతులు ఏ రంగంలోనైనా ధైర్యంగా ముందుకు సాగగలరనే సందేశాన్ని సమాజానికి అందిస్తోందని అన్నారు.
లడాఖ్ వంటి క్లిష్ట భౌగోళిక పరిస్థితులు, ఎత్తైన పర్వత మార్గాలు, సవాళ్లతో కూడిన రహదారుల మధ్య ఈ యాత్రను చేపట్టడం భాంధవి సంకల్పబలం, పట్టుదలకు నిదర్శనమని, యువతలో సాహస స్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ఇటువంటి యాత్రలు కీలక పాత్ర పోషిస్తాయని దత్తాత్రేయ పేర్కొన్నారు. భాంధవి విజయానికి ఆమె తల్లిదండ్రులు మెట్టు వాసు, పద్మావతి అందించిన ప్రోత్సాహం, మద్దతు అభినందనీయమని, కుటుంబ సహకారమే యువత విజయాలకు బలమైన పునాదిగా నిలుస్తుందని దత్తాత్రేయ అన్నారు. లడాఖ్ యాత్రను విజయవంతంగా పూర్తిచేసి సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలవాలని బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు.













Leave a Reply