హైదరాబాద్, జూన్ 4, అద్దం న్యూస్ : అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులన్ని నరక కూపాలుగా మారాయని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అన్నారు. బుధవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత 10 ఏళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం పట్ల సరైన ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కుంటుపడిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కూడా పేరుకే ప్రభుత్వ ఆసుపత్రులు గాని వీటికంటే ధర్మాసుపత్రుల కంటే ఘోరంగా తయారయ్యాయని అన్నారు. ఒక వైపు కరోనా ఎక్కడ విస్తరిస్తుందోనని భయంతో జనం బెంబేలెత్తుతుంటే, ధైర్యం చెప్పాల్సిన నాయకులు కనీసం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మొన్న జరిగిన ఎర్రగడ్డ మానసిక చికిత్స ఆలయంలో 70 మందికి పైగా కలుషిత ఆహారం తిని ఒక వ్యక్తి మరణించడం, కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నా సంబంధిత ఆరోగ్యాల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం తమ పదవులు కాపాడుకునే ప్రయత్నంలోనే మంత్రులు కాలం వెలదీస్తున్నారని, అవినీతి డబ్బులు సంపాదించడమే జీవిత గమ్యంగా వ్యవహర్తిస్తున్నారని ఆరోపించారు. ఆనాడు తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆరోగ్య రాజధానిగా వెలుపొందిన హైదరాబాద్ నగరం.. నేడు రోగాలకు రాజధానిగా తయారయిందని ధ్వజమెత్తారు. రానున్న వర్షా కాలంలో డెంగ్యూ, మలేరియా, డయోరియా వంటి విష జ్వరాలు ప్రబలకుండా ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టడం లేదన్నారు.
ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో ఉంటే, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా అసలు ఉన్నారా ? లేరా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇన్చార్జ్ పొన్నం ప్రభాకర్ పట్టించుకోవడంలేదని, అందాల పోటీలంటూ డంభాచారం కొట్టుకోవడం మానుకొని ప్రజారోగ్యంపై శ్రద్ద పెట్టాలన్నారు. జిహెచ్ఎంసి నిద్రావస్థలో ఉందని, ప్రజారోగ్యం కుంటుపడిందని, అసలు డిఎంహెచ్ఓ కార్యాలయం పని చేస్తుందో ? లేదో తెలియదన్నారు. డాక్టర్లుంటే సౌకర్యాలు లేని ఆసుపత్రులు, సౌకర్యాలు ఉంటే డాక్టర్లు లేని ఆసుపత్రులు, రెండూ ఉంటే ఆసుపత్రిలో మందులు లేని పరిస్థితి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కనిపిస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించి, సమీక్షించే నాధుడే కరువయ్యాడని, వైద్యం దొరక్క ప్రజలు హలో లక్ష్మణా అంటూ రోదిస్తున్నారని, కాబట్టే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సాయిబాబా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజుగౌడ్, నాయకుడు ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply