మంచినీటి ఎద్దడిని నివారించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి
– తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, అద్దం న్యూస్ : వేసవికాలం ప్రారంభమై మార్చ్ నెలలోనే నగర శివారు ప్రాంతాలలో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొవడం జరుగుతోందని, నీటి ఎద్దడిని నివారించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. సోమవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… గతంలో కర్ణాటక రాష్ట్రంలో లాగా తాగడానికి నీళ్లు దొరకకుండా మన రాష్ట్రంలో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అదే విధంగా నీటి ఎద్దడి నివారించడానికి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సరఫరా చేస్తున్న వాటర్ టాంకులను అధికార పార్టీ నాయకులకు, వారి అనుచరులకు కేటాయిస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కో ట్యాంకరుకు 500 ల నుండి 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ అవినీతిని కట్టడి చేయాలన్నారు. భూగర్భ జలాలు ఆందోళన స్థాయిలో అడుగంటి పోతున్నాయన్నారు.
ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో భూగర్భ జలాలను పరిరక్షించడానికి శాస్త్రీయమైన పరిశోధనలో చేపట్టిన విధంగా మన రాష్ట్రంలో కూడా చేపట్టాలన్నారు. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎంతసేపు ఆరు వాగ్దానాలు అంటూ ప్రజాపాలన అంటూ హామీలతో కాలయాపన చేయకుండా తాగునీటి సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జలాశయాల్లో గత సంవత్సరం కంటే నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ప్రాజెక్టులన్ని డెడ్ స్టోరేజ్ నీటి మట్టానికి పడిపోయాయన్నారు. శ్రీశైలం నుంచి మంచినీటిని అవసరాల కోసం వాడుకోవాలని అన్నారు. నాగర్జున సాగర్ నీటిమట్టం తగ్గిపోయిందని, హైదరాబాదుకు నాగార్జున నుంచి ప్రతి రోజు రావాల్సిన సరఫరా కూడా తగ్గిపోయిందన్నారు. వాస్తవాన్ని గ్రహించి, ముందస్తు చర్యలు చేపట్టాలని సాయిబాబా డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్. పి.బాల్రాజ్ గౌడ్, ఎస్. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply