హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు
♦️ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టేను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్వాగతించారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు ఒక గట్టి ‘చెంపపెట్టు’ అని కేటీఆర్ అభివర్ణించారు. రాజకీయ కక్షసాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందన్న కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పని చేయాలన్నారు. రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికీ పీసీసీ ( PCC ) నివేదికని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్న మాట ఇవ్వాళ అక్షరాలా నిజమని తేలిపోయిందని దుయ్యబట్టారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలోని గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలకు బ్రేక్ పడినట్లయిందని స్పష్టం చేశారు.
కమిషన్ విచారణలో సహజ న్యాయ సూత్రాలను పూర్తిగా విస్మరించడమే కాకుండా, నిబంధనలకు పాతరేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారని, ఆ విషయాలతో ఇవ్వాళ హైకోర్టు కూడా ఏకీభవించడం హర్షణీయమని కెటిఆర్ తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని అభిప్రాయపడ్డారు. రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేడిగడ్డ బ్యారేజిలో స్వల్పంగా దెబ్బతిన్న రెండు పిల్లర్లను రిపేర్ చేసి, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని సూచించారు. రాజకీయ క్రీడ కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన హితవు పలికారు. గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి దోచిపెట్టి, తెలంగాణలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే కుతంత్రాలను ఇంకా కొనసాగించాలని చూస్తే రేవంత్ సర్కారుకు రైతుల చేతిలో వాతలు తప్పవని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, రైతుల పొలాలకు నీరు అందకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.












Leave a Reply