ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే ఇవ్వాలి
– నేతల డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 27, ( అద్దం న్యూస్ ) : విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య క్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మహాధర్నా జరిగింది. ఈ ధర్నాకు మద్దతుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సి మధుసూదన చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బకాయిలు చెల్లించకుంటే ప్రభుత్వం విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని, పెండింగ్లో ఉన్న 42 శాతం బీసీల కోటా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు టిసీలు, మెమోలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వైఎస్ హయాంలో పూర్తిస్థాయిలో చెల్లించేవారని, ప్రస్తుత ప్రభుత్వం సగం మాత్రమే చెల్లిస్తుందని, అదీ కూడా 8 వేల కోట్ల రూపాయలు బకాయిలో ఉన్నాయని తెలిపారు. సీఎం నాణ్యమైన విద్యనందిస్తామని చెబుతూ, విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. విద్యార్థులతో పెట్టుకుంటే మనుగడ సాగించలేరన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంఘాల నేతలు పాండు యాదవ్, కోలా జనార్దన్, శ్రీనివాస్ యాదవ్, సతీష్, గోపి, శివమ్మ, ఉదయ్ నేత, అరుణ్, మల్లేష్, రామ్మూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply