కాన్షీరాం ను ఆదర్శంగా తీసుకోవాలి
– మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
హైదరాబాద్, మార్చి 15, అర్థం న్యూస్ : కాన్షీరాం ను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంధు సొసైటీ అధ్యక్షుడు పల్లెల వీర స్వామి అధ్యక్షతన కాన్షీరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ… ఓటు హక్కును నేటికీ సరైన పద్ధతిలో ఉపయోగించకపోవడం వల్ల బహుజనులంతా రాజ్యాధికారానికి దూరమవుతున్నారన్నారు. కాన్షీరాం తన రాజకీయ ప్రయాణంలో చాలా మందిని రాజకీయ పార్టీలలో చెంచాలుగా అభివర్ణించారన్నారు. తను ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బహుజన కులాలను ఏకం చేసి చెంచాల కబంధ హస్తాల నుండి విడిపించి ఉత్తర ప్రదేశ్లో 4 సార్లు మాయావతిని ముఖ్యమంత్రిని చేసి భారత రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించిన గొప్ప సామాజిక వేత్త కాన్షీరాం అని అన్నారు.
నేటి రాజకీయాలలో అనేక మంది బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ బహుజనులను విడదీస్తూ కుల రాజకీయ చైతన్యాన్ని పెంచి రాజకీయ చైతన్యాన్ని దూరం చేస్తున్నారని తెలిపారు.ఓటు చైతన్యాన్ని కోల్పోతున్న బహుజనులకు ఓటు విలువను తెలియజేసి రాజ్యాధికారాన్ని అందించిన గొప్ప వ్యక్తి కాన్షీరాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్డీఎస్ అధికారి డాక్టర్ అప్పికట్ల భరత్ భూషణ్, ప్రొఫెసర్లు ఏకు తిరుపతి, ముత్తయ్య, గండి కృష్ణ, మంద కనకయ్య, వశపాక నర్సింహ, నర్సింగరావు, సత్యనారాయణ, కోలా జనార్దన్, దున్న యాదగిరి, సి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply