ప్రభుత్వాలు పంచిన అన్ని రకాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వాలి
– మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
హైదరాబాద్, ఆగస్టు 31, ( అద్దం న్యూస్ ) : ప్రభుత్వాలు పంచిన అన్ని రకాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. సిద్ధాంతం లేని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టే అని అన్నారు. భూములు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే యాజమాన్య హక్కులు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర చేవెళ్ల దళిత డిక్లరేషన్ పర్ధిల్లాలని, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ భూ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాకు మద్దతుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ… 2022లో విడుదల చేసిన జివో-20 ను రద్దు చేసి, రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏ సంస్థ హైదరాబాద్ ద్వారా సేకరించిన భూములను ఎకరం భూమిని లే అవుట్ చేసిన దానిలో లబ్దిదారులకు 1200 గజాల భూమి ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో అసైన్డ్ భూముల కమీషన్ నియమించాలని, గ్రామాల్లో భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాము తన పిల్లలను తానే మింగుతుందనే విధంగా ఈ ప్రభుత్వ విధానం ఉందన్నారు. ఆనాడు ఇందిరాగాంధీ లాంటి నాయకులు భూములను ఇస్తే ఈ ప్రభుత్వంలోని నాయకులు ఇచ్చిన భూములను గుంజుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ పేరును, కాంగ్రెస్ పార్టీ పేరును భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. ఆనాడు పనికిరాదని భూములను ఇచ్చారని, ఈ రోజు ఆ భూములు పనికి వస్తున్నాయని తెలుసుకుని గుంజుకుంటున్నారని మండిపడ్డారు.
రేవంత్రెడ్డికి ఓట్లు వేసిన పాపానికి దళిత వర్గాల ఉసురుపోసుకుంటున్నావని ధ్వజమెత్తారు. కమిషన్ ఇస్తేనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయటకు వస్తున్నాడని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మాదిగలకే రాజ్యం రావాలన్నారు. తెలంగాణలో మాదిగలు 70 లక్షల మంది జనాభా ఉన్నారని, మన ఓట్లు మనమే వేసుకోవాలన్నారు. ఓట్లు మన వద్దనే ఉన్నాయని, సీట్లు కూడా మనకే రావాలన్నారు. మాదిగ మహాశక్తి అనే సంస్థను ఏర్పాటు చేశానని, రాబోయే రోజుల్లో అది రాజకీయ పార్టీగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కు ఇస్తామని పొందుపరిచారని, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఎన్నికల సభలలో వాగ్దానం చేశారన్నారు. దాదాపు 25 లక్షల ఎకరాల భూముల లబ్ధిదారులు 15 లక్షల కుటుంబాలు, 50 లక్షల ఓటర్లు 70 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నదే ఈ అసైన్డ్ భూముల యాజమాన్య హక్కుల ఆకాంక్ష అని అన్నారు. ఇది సహజ సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణంగా భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని అన్నారు. ఈ మహాధర్నాలో తెలంగాణ భూ రక్షణ సమితి రాష్ట్ర నాయకులు కడారి నాగేశ్వరరావు, డాక్టర్ మల్లేష్, తాళ్లపల్లి లింగం, కలకోటి రాములు, చింత స్వామి, ఆప్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ, విజయ్ కుమార్, వరలక్ష్మీ, నాగమణి, రోజారాణి, భారతి, ఎన్.శ్రీశైలం, కరుణాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply