కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లనే పెట్రోల్, డీజిల్ కొరత
– తెలంగాణ టీడీపీ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 28, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయి సామాన్య ప్రజలు, రైతులు, రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, సమన్వయ లోపం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లెల్ల కిషోర్, పలుస బాలరాజ్ గౌడ్ లు మండిపడ్డారు. హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఇంధనం దొరక్క వందలాది వాహనాలు నిలిచిపోయాయని, రాజేంద్రనగర్ వంటి శివారు ప్రాంతాల నుంచి మొదలుకొని పల్లెల వరకు ‘ నో స్టాక్ ‘ బోర్డులే దర్శనమిస్తున్నాయని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వదంతుల వల్లే కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితి భయానకంగా ఉందని వారు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ముడి చమురు నిల్వలు ఉన్నాయని చెబుతుంటే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డీలర్లకు క్రెడిట్ సదుపాయం నిలిపివేయడం ఏంటని ? ప్రశ్నించారు. కంపెనీల లాభాపేక్ష కోసం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు విమర్శించారు.
మరో వైపు రైతుల ఇక్కట్లు, ప్రస్తుత రబీ కోతల సీజన్లో డీజిల్ దొరక్క ట్రాక్టర్లు, హార్వెస్టర్లు మూలకు పడ్డాయని, ఇది రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే నని అన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉన్న వాహనదారులకు కనీస భరోసా ఇవ్వలేకపోతోందని విమర్శించారు. కృత్రిమ కొరత సృష్టించి ఆయిల్ కంపెనీలు కావాలనే సరఫరాను తగ్గిస్తున్నాయా? లేక బ్లాక్ మార్కెట్కు తరలుతుందా ? అనే అంశంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు, కనీసం నిత్యావసరమైన ఇంధనాన్ని కూడా సరఫరా చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి పెట్రోల్ బంకులకు పూర్తిస్థాయిలో ఇంధన సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రజల తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాబమని నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు సుదర్శన్ రెడ్డి, ఎం.శ్యామ్ సుందర్, కరణం కిరణ్, తడక వినోద్, భాను ప్రకాష్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply