నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డి – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డి

– ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి


హైదరాబాద్, ఆగ‌స్టు 30, అద్దం న్యూస్ :   నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే విధంగా రాష్ట్ర మంత్రిమండలిలో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. “సిద్ధాంతాలు చెప్పడమే కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం 65 సంవత్సరాలు నిబద్ధతతో జీవించడం ద్వారా సురవరం కు ఆ గౌరవం దక్కిందన్నారు. వారు ఏ జెండాను మోశారో, ఏ జెండా మోయడం గొప్పగా భావించారో.. చివరి శ్వాస తర్వాత కూడా ఆ జెండా నీడనే విశ్రమించడం అత్యంత అరుదన్నారు. ప్రజలతో గుర్తింపబడిన మహనీయుల పేర్లు ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నిలవాలన్నారు. అందుకే తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు, కోఠీ మహిళా విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టుకున్నామ‌న్నారు. సామాన్య ప్రజల్లో చైతన్యం నింపి గోల్కొండ కోటను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ట్యాంక్‌బండ్‌పై వారి విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటున్నామ‌ని తెలిపారు. ఒక ప్రాంతం నుంచి సమాజంలో గుర్తింపు పొందిన ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఆ ప్రాంత వాసులకు గర్వంగా ఉంటుంద‌న్నారు.                                                          మొదటి తరంలో సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణా రావు, రెండో తరంలో జైపాల్ రెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు వన్నె తెచ్చారని, వారెప్పుడు సమాజంలో గౌరవం పొందుతూనే ఉంటారన్నారు. సురవరం విజయలక్ష్మి చిన్న కోరికలు కోరారు. వారి గౌరవం ఆలంపూర్ శాసనసభ నియోజకవర్గానికే కాదని, సురవరం సుధాకర్ రెడ్డి గౌరవం, రాష్ట్ర స్థాయిలో ఉండే విధంగా శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా మంత్రివర్గంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. ప్రస్తుతం సమాజంలో ప్రజాస్వామిక మూల సిద్ధాంతానికి విరుద్ధంగా పెరిగిపోతున్న విపరీత పోకడలను అడ్డుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను హరించే ప్రమాదకర పరిస్థితులను తలెత్తుతున్నాయన్నారు. ప్రజలను చైతన్య పరిచే ఆలోచన ఎవరూ చేయడం లేదన్నారు. అందుకోసం ఐక్య కార్యాచరణ నిర్మించుకోవాల‌న్నారు. అప్పుడే సురవరం లాంటి నేతకు ఘనమైన నివాళి..” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సంస్మరణ సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సురవరం విజయలక్ష్మి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీనియర్ నాయకులు కె.నారాయణ, కేవీపీ రామచందర్ రావు, రామకృష్ణ, శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page