ఆ ప‌నుల‌కు నిధుల‌ను మేమే తెప్పించాం – పోటాపోటీగా ఫొటోలు దిగిన బిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నాయ‌కులు

ముషీరాబాద్‌లో బిఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్
ఆ ప‌నుల‌కు నిధుల‌ను మేమే తెప్పించాం
– పోటాపోటీగా ఫొటోలు దిగిన బిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నాయ‌కులు

హైదరాబాద్, జ‌న‌వ‌రి 3, అద్దం న్యూస్ :   ముషీరాబాద్‌లో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. రానున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో బిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు త‌మ త‌మ ఉనికిని చాటుకునేందుకు పోటీ ప‌డుతున్నాయి. అభివృద్ధి ప‌నుల‌ను మేమే చేయిస్తున్నామంటే కాదు కాదు మేము చేయిస్తున్నామ‌ని ఫొటోలు దిగుతున్నారు. ముషీరాబాద్ డివిజ‌న్ ప‌ఠాన్‌బ‌స్తీలో నూత‌నంగా నిర్మించ‌నున్న సివ‌రేజి పైప్‌లైన్ ప‌నుల‌కు నిధుల‌ను తెప్పించింది మేమంటే మేము అని బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పోటాపోటీగా ప్ర‌చారాలు చేసుకుంటున్నారు.

 ఇందులో భాగంగా శ‌నివారం ముషీరాబాద్ డివిజ‌న్ ప‌ఠాన్‌బ‌స్తీలో సివ‌రేజి పైప్‌ల‌ను ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.అర‌వింద్ కుమార్ యాద‌వ్‌లు వేర్వేరుగా ప‌రిశీలించారు. తొలుత ఎమ్మెల్యే ముఠా గోపాల్ బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి పైప్‌ల‌ను ప‌రిశీలించారు. స్థానికంగా పాద‌యాత్ర చేసి, పైప్‌లైన్ల‌ను ఎక్క‌డి నుంచి ఎక్క‌డి వ‌ర‌కు వేయాలి త‌దిత‌ర అంశాల‌పై స్థానికుల‌తో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… ప‌ఠాన్‌బ‌స్తీలో ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ ఓవ‌ర్‌ఫ్లో స‌మ‌స్య ఉంద‌ని, పెరిగిన జ‌నాభాక‌నుగుణంగా పైప్‌లైన్లు మార్చాల‌ని అనేక ఫిర్యాదులు వ‌చ్చాయ‌న్నారు. డ్రైనేజీ ఓవ‌ర్‌ఫ్లో అయిన‌ప్ప‌డల్లా స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులుప‌డేవార‌న్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో పెట్టుకొని వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల‌తో మాట్లాడి రూ.22 ల‌క్ష‌ల నిధుల‌ను మంజూరు చేయించాన‌ని ఎమ్మెల్యే తెలిపారు. ఇక పై డ్రైనేజీ స‌మ‌స్య‌తో ప‌ఠాన్‌బ‌స్తీ ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డే అవ‌స‌రం లేద‌న్నారు. వారి స‌మ‌స్య శాశ్వ‌తంగా తీర‌నుంద‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జైసింహా, ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండ శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్, పులిగిల్ల శ్రీధర్ చారి, బిఆర్ఎస్ నాయకులు జావీద్ ఖాన్, సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి, మహబూబ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, మునావ‌ర్‌ చాంద్, జాఫర్, మున్నా ఖాన్, సమీర్ హుస్సేన్, సర్వర్, ఫిరోజ్ ఖాన్, సాదిక్, ఇమ్రాన్ ఖురేషి, సల్మాన్, బల్ల ప్రశాంత్, వసీం ఖాన్, అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

మాట ఇచ్చినం.. నిధుల‌ను తెప్పించాం :
– యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్‌

ప‌ఠాన్ బ‌స్తీలో మాట ఇచ్చిన ప్ర‌కారం డ్రైనేజీ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం నిధుల‌ను తెప్పించామ‌ని యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్ తెలిపారు. శ‌నివారం ప‌ఠాన్‌బ‌స్తీలో త్వ‌ర‌లో నిర్మించ‌నున్న డ్రైనేజి పైప్‌ల‌ను ఆయ‌న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అర‌వింద్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ… గ‌తంలో బిఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌దేళ్ల పాటు అధికారంలో ఉన్నా ప‌ఠాన్‌బ‌స్తీలో ఉన్న డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. తూ తూ మంత్రంగా విన‌తి ప‌త్రాలు ఇచ్చారు కానీ, గ‌త అసెంబ్లీ ఎన్నిక‌లో గెలిస్తే మేము డ్రైనేజి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీనిచ్చామ‌న్నారు. దురదృష్ట‌క‌రంగా మేము అసెంబ్లీలో ఓడిపోయిన‌ప్ప‌టికి మా రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ చొర‌వ‌తో సంబంధిత ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడి జ‌న‌ర‌ల్ బ‌డ్జెట్ కింద రూ.22 ల‌క్ష‌ల 75 వేల రూపాయ‌ల‌ను మంజూరు చేయించామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కార్పొరేట‌ర్ వాజిద్ హుస్సేన్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు నాగ‌భూష‌ణం గౌడ్‌,డాక్ట‌ర్‌.హ‌నీఫ్‌, అతిన‌గ‌రం సుధేష్‌, లింగం గుప్త‌, ర‌మేష్ గౌడ్‌, రాజ్‌దీప్‌, వైపి.రాజు, సురేష్‌, నియాజ్ అహ్మ‌ద్‌, అల్లావుద్దీన్‌, కృష్ణ‌గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page