కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ నిపుణుల సూచనల మేరకు
విచారణ చేపట్టాలని సిబిఐకి లేఖ రాయండి
– అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కోసం న్యాయ నిపుణుల సూచనల మేరకు తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. అవసరమైతే ఈ విషయంలో సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా వినతిపత్రం అందించాలని మంత్రులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీ తో చర్చించి ప్రభుత్వం అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించారు.
పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును, కమిషన్ ఇచ్చిన నివేదికను హైకోర్టు తప్పు పట్టలేదని, అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయని న్యాయ నిపుణులు వివరించారు. కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్లో లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అందువల్ల సీబీఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైన అడ్డంకులు లేవని అభిప్రాయపడ్డారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సుప్రీంకోర్టు న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ఈఎన్సీ శ్రీధర్, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.![]()












Leave a Reply