అద్దం న్యూస్, వెబ్డెస్క్: సత్యం కుంభకోణం ఆధారంగా ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియా’ (‘Bad Boy Billionaire’ series) డాక్యుమెంటరీ సిరీస్ విడుదలపై ఉన్న ఆంక్షలను సిటీ సివిల్ కోర్టు ఎత్తివేసింది. ఐదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇన్జంక్షన్ పిటిషన్ను కొట్టివేస్తూ న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. 2020లోనే డాక్యుమెంటరీ విడుదలకు సిద్ధమవగా.. నిలిపివేయాలంటూ బైర్రాజు రామలింగరాజు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఈ డాక్యుమెంటరీ (‘Bad Boy Billionaire’ series)లో అర్ధసత్యాలున్నాయి. కింది కోర్టు రామలింగరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష విధించగా..దీనిపై ఆయన అప్పీలు దాఖలు చేశారు. ఇది పెండింగ్లో ఉండగా ఓ ముగింపునకు వచ్చి డాక్యుమెంటరీ తీసి విడుదల చేయడం సరికాదు. అది పిటిషనర్ హక్కులకు భంగం కలిగిస్తుంది’ అని విన్నవించారు.
వాదనలు విన్న సివిల్ కోర్టు.. సిరీస్ ప్రదర్శనను నిలిపివేస్తూ 2020 సెప్టెంబరు 1న ఉత్తర్వులు జారీచేసింది. నెట్ఫ్లిక్స్ తరఫు న్యాయవాది బొమ్మినేని వివేకానంద వాదనలు వినిపిస్తూ.. బహిరంగమైన రికార్డులు, లిఖితపూర్వక డాక్యుమెంట్ల ఆధారంగా డాక్యుమెంటరీ రూపొందిందని, పిటిషనర్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి దృష్టి సారించలేదన్నారు. చారిత్రక మోసాన్ని ప్రజలకు తెలపడమే ఉద్దేశమని స్పష్టం చేశారు. వాదనల అనంతరం న్యాయస్థానం ఇంజంక్షన్ ఆర్డర్ను రద్దు చేయడంతో పాటు, విడుదలను నియంత్రించే హక్కు లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు ప్రతి వెలువడాల్సి ఉంది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
